‘విజయమ్మకు విషెస్’… నెట్టింట ఈ కొత్త రచ్చ చూశారా..?

ఏప్రిల్ 19న… దివంగత ముఖ్యమత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సతీమణి.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తల్లి, వైఎస్ విజయలక్ష్మి పుట్టినరోజు. దీంతో… షర్మిలతో పాటు చాలామంది ప్రముఖులు, కుటుంబ సభ్యులు, వైఎస్సార్ అభిమానులు ఆమెకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

ఆ సంగతి అలా ఉంటే… అప్పటికే వైఎస్ జగన్ తన తల్లికి ఫోన్ చేసి శుభాకాంక్షలు చెప్పారో ఏమో కానీ.. ‘ఎక్స్’ వేదికగా మాత్రం ఆ విషయాన్ని ప్రకటించలేదు. అయితే.. తెలుగుదేశం పార్టీ జాతీయ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ మాత్రం… సోషల్ మీడియా వేదికగా వైఎస్ విజయమ్మకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు.

“శ్రీమతి వైఎస్ విజయమ్మ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.. ఈ శుభ సందర్భంగా ఆమె మంచి ఆరోగ్యం, ఆనందంతో ఉండాలని ఆకాంక్షిస్తున్నాము” అంటూ నారా లోకేష్ బర్త్ డే విషెస్ చెప్పారు.

అంతవరకూ బాగానే ఉంది. తన తండ్రి తరుపునుంచి… తాత, నానమ్మ, మేనత్తలు, బాబాయ్, పిన్నిలు, అన్నలూ, తమ్ముళ్లూ ఎవరికీ ఏనాడూ ఇలా సోషల్ మీడియా వేదికగా బర్త్ డే విషెస్ చెప్పినట్లు కనిపించని లోకేష్… కారణం ఏమైనప్పటికీ.. వైఎస్ విజయలక్ష్మి విషయంలో మాత్రం ఓ అడుగు ముందుకు వేశారని చెప్పుకోవచ్చు.

అప్పటికి ఇంకా జగన్ విషెస్ చెప్పలేదు కాబట్టి.. తాను ముందు చెప్పాలని, తద్వారా వైసీపీ శ్రేణులను గిల్లాలని భావించారో.. లేక, తన రాజకీయ భవిష్యత్తుకు వైఎస్ విజయమ్మ సానుభూతి సైతం కావాలని కోరుకుంటున్నారో.. అదీగాక, షర్మిలపై కృతజ్ఞతతో స్పందించారో తెలియదు కానీ.. గతంలో “వైఎస్ విజయ” అంటూ ఏకవచనంతో సంభోదిస్తూ అగౌరవపర్చిన లోకేష్.. నేడు మాత్రం “వైఎస్ విజయమ్మ” అని సంబోధిస్తూ పోస్ట్ పెట్టడం గమనార్హం.

అదంతా ఒకెత్తు అయితే… లోకేష్ కనుసన్నల్లో నడుస్తున్నాయని ఆరోపించబడే పలు టీడీపీ అనుకూల వెబ్ సైట్స్ లో ఈ వ్యవహారంపై జగన్ ను దెప్పిపొడుస్తూ వార్తలు హల్ చల్ చేస్తున్నాయి. ఇక వారి సోషల్ మీడియా సంగతి సరేసరి. శృతిమించిన పోస్టులు, కామెంట్లతో చెలరేగిపోతున్న పరిస్థితి!!

“విజయమ్మకు నారా లోకేష్ శుభాకాంక్షలు చెప్పారు కానీ, జగన్ మాత్రం తన తల్లికి శుభాకాంక్షలు చెప్పలేకపోయారు.. వైఎస్ విజయమ్మకు జగన్ బర్త్ డే విషెస్ చెప్పనంత దూరం జరిగిపోయారా.. అంత గ్యాప్ పెరిగిపోయిందా.. డాక్టర్ వైఎస్సార్ కుటుంబంలో ఈ పరిస్థితా” అంటూ వారంతా అల్లాడిపోతున్నట్లు కనిపిస్తున్నారు.

ఏ ఉద్దేశ్యంతో చెప్పినా, ఏమి ఆశించి చెప్పినా… వైఎస్ విజయమ్మకు లోకేష్ బర్త్ డే విషెస్ చెప్పడం తప్పుకాదు.. కానీ, జగన్ ఎందుకు చెప్పలేదంటూ అనుకూల మీడియాలో వార్తలు రాయించుకోవడం మాత్రం స్థాయికి తగిన పని కాదని అభిప్రాయాన్ని కలిగించడంతో పాటు… ‘కచ్చితంగా ఆ ఉద్దేశ్యంతోనే ఈ విషెస్’ అనే నమ్మకమూ కలుగుతుందని అంటున్నారు.

ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ అభిమానులు ఎంట్రీ ఇచ్చారు.

ఇందులో భాగంగా.. నిత్యం చంద్రబాబు మేలు కోరుతూ.. ఎన్నికలకు ముందు కూటమి ఏర్పాటు కోసం హస్తినలో ఎంతో కష్టపడి.. ఎన్నికల సమయంలో కూటమి తరుపున ఎంతో బలంగా ప్రచారం చేసి.. నేడు చంద్రబాబు సీఎంగా, లోకేష్ మంత్రిగా ఉండటంలో కీలక భూమిక పోషించిన పవన్ కల్యాణ్ తల్లికి ఎప్పుడైనా లోకేష్ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టారా? అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారని తెలుస్తోంది.

రాజకీయ ప్రత్యర్థి అయిన జగన్ తల్లికి బర్త్ డే విషెస్ చెబుతారు కానీ… నేడు కూటమి నేతలు అనుభవిస్తున్న హోదాలకు, అధికారానికి కీలక కారణమైన పవన్ కల్యాణ్ తల్లికి కానీ, ఆయన సతీమణికి కానీ, ఆయన పిల్లలకు కానీ లోకేష్ ఏనాడైనా బర్త్ డే విషెస్ చెప్పారా..? ఇదేనా ఆయనపై లోకేష్ కి ఉన్న కృతజ్ఞత..? అంటూ మండిపడుతున్నారు. ఇకపై పవన్ తల్లిని, ఆయన కుటుంబ సభ్యులను సైతం గుర్తుంచుకోవాలని సూచిస్తున్నారు.

అదేవిధంగా… “కళాకారులు ఎక్కడ గౌరవించబడతారో ఆ రాష్ట్రం, దేశం సుభిక్షంగా ఉంటుందని నానుడి.. దీని అర్ధం గ్రహించి, ఆగిపోయిన అవార్డులను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ గారు కళాకారులను గౌరవించుకోవాలి అని దీనికి పునర్జీవం పోశారు.. కానీ, పక్క రాష్ట్రమైన మన తెలుగు రాష్ట్రం కళాకారుల పట్ల, సినిమాల పట్ల ఉత్సాహపరిచే విధానంలో కాస్త వెనుకంజ వేసి ఉంది అనుకుంటున్నాను”.. అంటూ గద్దర్ అవార్డుల కార్యక్రమంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యల సంగతి తెలిసిందే.

అనంతరం… టీడీపీ అనుకూల సోషల్ మీడియా చిరంజీవి వ్యాఖ్యలపై చేసిన రచ్చను, ఆయనపై చేసిన విధ్వేషపూరితమైన కామెంట్లను, ఆయనను అవమానించిన తీరును ఈ సందర్భంగా వారు గుర్తు చేస్తున్నారు. ఇదేనా పవన్ కల్యాణ్ అన్నకు టీడీపీ తమ్ముళ్లు ఇచ్చే మర్యాద అని నిలదీస్తున్నారు.

ఈ గ్యాప్ లో వైసీపీ అభిమానులు, ఆ పార్టీ సోషల్ మీడియా జనాలు ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా…

* నారా చంద్రబాబు కుటుంబంలో ఏమి జరుగుతుంది..?

* ఆయన తన తల్లి తల్లితండ్రులను ఎలా చూసుకున్నారు..?

* తోబుట్టువులను ఎలా ఆదుకున్నారు..?

* తమ్ముడికి ఎలా తోడున్నారు..?

* అసలు ఎప్పుడూ వారి పేర్లు సైతం ఎందుకు ప్రస్తావించరు..?

* పూర్తిగా ఇల్లరికం వచ్చిన అల్లుడిగానే ఎందుకు వ్యవహరిస్తారు..?”

* లోకేష్ సైతం తాను ఎన్టీఆర్ మనవడిని అంటారే తప్ప, నారా కర్జూర నాయుడు వారసుడిని అని ఎందుకు చెప్పరు..?

* ఈ రోజు తన అత్త బర్త్ డే అనో, తన మావయ్య పెళ్లి రోజనో ఎందుకు ఏనాడూ విషెస్ చెప్పరు..?

* అసలు చంద్రబాబు తండ్రి, తల్లి పేర్లు.. వాళ్ల జయంతులు, వర్ధంతుల గురించి ఎవరికైనా ఏమైనా తెలుసా..?

* వాళ్ల బర్త్ డే లకు చంద్రబాబు కానీ, లోకేష్ కానీ ఎప్పుడైనా స్పందించారా..?

* రాష్ట్రవ్యాప్తంగా అన్నదానాలు, రక్తదానాలు వంటివి చేశారా..?

* అటు చంద్రబాబు అయినా, ఇటు లోకేష్ అయినా… తాము నందమూరి ఇంటి అల్లుల్లగానే చెప్పుకోవడానికి ఉత్సాహం చూపిస్తారు తప్ప… నారా ఖర్జూర నాయుడి వారసులమని ఎందుకు చెప్పుకోరు?

* చంద్రబాబు నాయుడు తన తండ్రి పేరు ఎక్కడా ప్రస్థావించడం లేదు కదా అని… కర్జూర నాయుడు జయంతికి జగన్ పోస్టులు పెట్టారా..?

* చంద్రబాబు, లోకేష్ లు వాళ్ల గురించి ఎప్పుడూ ప్రస్థావించరు గనుక.. మనం గిల్లుదామని వైసీపీ వర్గాలు ఎప్పుడైనా ఆలోచించాయా..?

* ఈ విషయం లోకేష్ & కో కి తెలియంది కాదు కదా..?

* అయినప్పటికీ… పిల్ల చేష్టలు, గిచ్చే పనులు చేయాలని కాకపోతే… ఎందుకు ఇవన్నీ? అని వైసీపీ సోషల్ మీడియా జనాలు ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.

ఏది ఏమైనా… కొత్తగా టీడీపీకి వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన లోకేష్ మారిపోయారంటూ పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు. అయితే… ఈ మార్పు విజయమ్మకు విషెస్ చెప్పడంతో ఆగిపోకూడదని..  విజయమ్మతో పాటే.. తన తాత ఖర్జూర నాయుడు, తన నానమ్మ అమ్మనమ్మతో పాటు అమ్మమ్మ లక్ష్మీ పార్వతిని సైతం ఇలాంటి విషయాల్లో గుర్తు పెట్టుకోవాలని పలువురు కోరుకుంటున్నారు.

ఇదే సమయంలో రాఖీ పండుగ రోజు చంద్రబాబు తన తోబుట్టువులను కలవాలని.. వారికి భువనేశ్వరి చీర, సారె పెట్టి గౌరవించాలని, అభిమానించాలని సైతం వారు కోరుకుంటున్నారు. వీరంతా.. ప్రజాసేవలో పడి కుటుంబ సభ్యులను నిర్లక్ష్యం చేయకూడదని సూచిస్తున్నారు.