‘ఎన్నికలకు చాలా సమయం వుంది. ఇప్పుడే పొత్తుల ప్రస్తావన ఎందుకు. మేం అయితే బీజేపీతోనే కలిసి వెళుతున్నాం. టీడీపీతో పొత్తు వ్యవహారం ముందు ముందు తేలుతుంది. ఆ విషయమై పార్టీలో చర్చ జరగాలి.. మిత్ర పక్షం బీజేపీతోనూ చర్చించాల్సి వుంటుంది..’ అని జనసేన పార్టీ చెబుతోంది.
కానీ, జనసేనతో పొత్తు కుదిరిందనీ, ఆ పార్టీకి పది సీట్లు మాత్రమే కేటాయించే అవకాశం వుందని వైసీపీ అంటోంది. టీడీపీ శ్రేణుల్లో అయితే, ఓ ముప్ఫయ్ నుంచి యాభై సీట్ల వరకు జనసేనకు వదిలేసే అవకాశముందన్న చర్చ జరుగుతుండడం గమనార్హం.
మరోపక్క, ‘50 శాతం సీట్లను జనసేన అడిగింది.. ఈ విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పవన్ కళ్యాణ్కి చంద్రబాబు ఇటీవల భేటీలో చెప్పారు..’ అంటూ ఇంకో వాదన తెరపైకొచ్చింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2019 ఎన్నికల్లో టీడీపీకి వచ్చిన ఓట్ల శాతానికీ, జనసేన సాధించుకున్న ఓట్ల శాతానికీ చాలా చాలా తేడా వుంది. ఆ లెక్కన, జనసేనకు 30 నుంచి 40 సీట్లను టీడీపీ కేటాయిస్తే అదే చాలా ఎక్కువ. ఇదీ టీడీపీ వాదనగా కనిపిస్తోంది. అయితే, ఈ మధ్యకాలంలో చాలా మారాయ్.
స్థానిక ఎన్నికల్లో టీడీపీ కంటే జనసేన పార్టీనే కొన్ని చోట్ల చాలా గట్టిగా నిలబడింది. అలా చూసినప్పుడు, టీడీపీ కంటే కూడా జనసేన ఎక్కువ సీట్లలో పోటీ చేస్తేనే లాభమన్నది జనసేన నేతల వాదన. అన్ని విషయాలపైనా సంక్రాంతి తర్వాత ఓ స్పష్టత వచ్చే అవకాశం వుందట.
ఫిబ్రవరిలో చంద్రబాబు – పవన్ కళ్యాణ్ మధ్య మళ్ళీ భేటీ జరుగుతుందనీ, బీజేపీ నుంచి కూడా ఈ భేటీకి ఓ ముఖ్య నేత హాజరవుతారన్నది తాజా ఖబర్.
