తెలంగాణలో ఎన్నికల తేది దగ్గర పడుతున్న కొద్ది కోట్ల రూపాయల నగదు చేతులు మారుతుంది. ప్రచార ఘట్టం ముగిసిన తర్వాత ప్రలోభాల పర్వం కొనసాగనున్నట్టుగా ఇప్పటికే టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు తనీఖీలు ముమ్మరం చేశారు. ఆదివారం అర్ధరాత్రి టిడిపి అభ్యర్దికి చెందిన కారులో భారీగా నగదు పట్టుబడింది.
శేరిలింగంపల్లి టిడిపి అభ్యర్ధిగా మహాకూటమి మద్దతుతో భవ్య ఆనందప్రసాద్ బరిలో నిలిచారు. ఇప్పటికే ఆయన తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. శేరిలింగంపల్లిలో పోలీసులు తనీఖీలు నిర్వహిస్తున్నారు. ఇంతలో ఓ కారును పోలీసులు ఆపగా ఆ కారు డ్రైవర్ కారును ఆపకుండా టిడిపి వారిది అంటూ అక్కడి నుంచి ముందుకు తీసుకు వెళ్లే ప్రయత్నం చేశాడు. అనుమానం వచ్చిన పోలీసులు అంతా ఆ కారును క్షణాల్లో చుట్టుముట్టారు. అందులో ఉన్న డ్రైవర్ తో పాటు మరో వ్యక్తిని కిందకు దింపి కారును తనీఖీ చేశారు. కారు డిక్కిలో, సీట్ల కింద 70 లక్షల రూపాయల నగదును పోలీసులు పట్టుకున్నారు.
ఈ డబ్బు లెక్కలు చూపాలని అడగగా అది వ్యాపారానికి సంబంధించిన డబ్బులని వారు చెప్పారు. భవ్య సిమెంట్ లావాదేవిల కోసం తీసుకెళుతున్న డబ్బు అని దానికి, ఎన్నికలకు సంబంధం లేదని వారు చెప్పారు. కారు భవ్య ఆనంద ప్రసాద్ కొడుకు పేరు మీద ఉంది. కారు తనిఖీ సమయంలో డ్రైవర్ తో పాటు కంపెనీ డైరెక్టర్ ఉన్నారు. డబ్బులకు సంబంధించిన లెక్కలు చూపించాల్సిందే అని పోలీసులు నగదును స్వాధీనం పరుచుకున్నారు.
అవి కంపెనీ డబ్బు అనీ, ఎన్నికల్లో పంచడానికి తీసుకెళుతున్న పైసలు కాదని కంపెనీ డైరెక్టర్ శివకుమార్ అన్నారు. నగదుకు సంబంధించిన వివరాలన్ని సమర్పించి డబ్బను తీసుకెళతామని శివకుమార్ తెలిపారు. తనిఖీ విషయం తెలుసుకున్న టిడిపి కార్యకర్తలు అక్కడికి చేరుకున్నారు. అకారణంగా వేధిస్తున్నారని కేసీఆర్ కుటుంబం లాగా తాము డబ్బులు పంచడం లేదని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ డబ్బు శేరిలింగంపల్లి అభ్యర్ధి భవ్య ఆనంద్ ప్రసాద్ కి చెందినదని టిఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు. ఎన్నికల్లో పంచేందుకే ఆ డబ్బును తీసుకు వస్తున్నారని దానిని సీజ్ చేయాలని వారు కోరారు. ఎన్నికల సమయం దగ్గర పడడంతో ప్రలోభాల పర్వం పెరగుతుందని తెలుస్తోంది.
ఎన్నికల ప్రచారం 5 వ తేది సాయంత్రానికి ముగుస్తది. 5 వ తేది సాయంత్రం నుంచి 7 వ తేది ఉదయం వరకు చాలా కోట్ల రూపాయలు చేతులు మారనున్నట్టుగా తెలుస్తోంది. ఈ సమయమే ఎన్నికల ఫలితాలను నిర్ణయిస్తుందని చాలా మంది నమ్ముతారు. ఇప్పటి వరకు చేసిన ప్రచారం ఒక ఎత్తు, ఈ రెండు రోజుల గడువు మరో ఎత్తు అని చర్చ జరుగుతోంది.
ఈ తక్కువ సమయంలోనే ఓటర్లను ఆకర్షించేందుకు వివిధ పార్టీలు, నేతలు… నగదు, మద్యాన్ని ఎరగా చూపే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం కూడా దీని పై సీరియస్ గానే ఉంది. ప్రచారం ముగియగానే అన్ని ప్రాంతాల్లో కూడా తనిఖీలు పకడ్భందీ చేయాలని ఇప్పటికే ఆదేశాలిచ్చింది.
