సినీ నటుడు నందమూరి తారక రత్న ప్రత్యక్ష రాజకీయాల్లోకి రాబోతున్నాడు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించాడు. 2024 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేస్తాననీ, ఆంధ్రప్రదేశ్ నుంచే పోటీ చేయబోతున్నాననీ తారకరత్న చెప్పుకొచ్చాడు.
‘సరైన సమయంలో టీడీపీ కోసం జూనియర్ ఎన్టీయార్ తప్పక వస్తాడంటూ తారకరత్న వ్యాఖ్యానించడం గమనార్హం. అసలు సరైన సమయమంటే ఏంటి.? జూనియర్ ఎన్టీయార్ తెలుగుదేశం పార్టీ కోసం వస్తాడా.? రాడా.?ఈ విషయమై నందమూరి అభిమానుల్లోనే బోల్డన్ని అనుమానాలున్నాయి. తారకరత్న అంటే నందమూరి కుటుంబంలోనే యంగ్ టైగర్ ఎన్టీయార్ని అత్యంత దారుణంగా అవమానపర్చిన వ్యక్తిగా చాలామందికి గుర్తుకొస్తాడు. అదెంత నిజం.? అన్నది వేరే చర్చ.
జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ని ఆ మధ్య ‘బాబాయ్’ అని అభివర్ణించాడు ఇదే తారకరత్న. టీడీపీ – జనసేన మధ్య పొత్తు ఖాయమని తారకరత్న బలంగా నమ్ముతున్నాడు కూడా. అయితే, ఆ పొత్తు కుదురుతుందా.? లేదా.? అన్నది ముందు ముందు తేలుతుంది. పొత్తు తేలకపోతే, ఇదే తారకరత్న.. జనసేన మీద విమర్శలు చేయాల్సి వస్తుంది.
ఇంతకీ, తాకరకత్న ఎక్కడి నుంచి పోటీ చేస్తాడు.? టీడీపీలో చంద్రబాబు, నారా లోకేష్, బాలకృష్ణ.. ఇలా ‘కుటుంబ సభ్యుల’ సంఖ్య పెరుగుతూ వస్తోంది.. కంటెస్టెంట్ల విషయంలో. హరికృష్ణ కుమార్తె సుహాసిని ఈసారి ఏపీ నుంచి పోటీ చేస్తారన్న ప్రచారం జరుగుతోంది. తారకరత్న కూడా ఎన్నికల బరిలోకి దిగతే.. ‘కుటుంబ పార్టీ’ అన్న విమర్శకు టీడీపీ పూర్తి న్యాయం చేసినట్లవుతుంది.
