బ్రేకింగ్ : కేసిఆర్ సెప్టెంబరు సెంటిమెంట్

తెలంగాణ సిఎం కేసిఆర్ దూకుడు మరింత పెంచారు. ఒకవైపు ఎన్నకల తరుణం ముంచుకొస్తుంటే మరోవైపు కేసిఆర్ అంతే స్పీడ్ గా కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. తెలంగాణ రాజకీయాలు సెప్టెంబరులో కీలక మలుపు తిరిగే చాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే కేసిఆర్ సెప్టెంబరు నెలలోనే ఎన్నికల నగారా మోగించే అవకాశాలున్నాయి. మరి కేసిఆర్ కు సెప్టెంబరు సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా ? అన్న చర్చ పక్కన పెడితే ప్రతిపక్ష పార్టీలను మాత్రం కేసిఆర్ గందగోళంలోకి నెట్టే అవకాశాలున్నాయి.  సోమవారం సిఎం కేసిఆర్ అధ్యక్షతన తెలంగాణ భవన్ లో జరిగిన టిఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం సిఎం కేసిఆర్ మీడియాతో సుదీర్ఘంగా మాట్లాడారు.

సెప్టెంబరు 2వ తేదీన హైదరాబాద్ లో ప్రగతి నివేదన పేరుతో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయనున్నట్లు కేసిఆర్ మీడియాతో ప్రకటించారు. ఈ భారీ బహిరంగసభ ద్వారా నాలుగేళ్లలో జరిగిన ప్రగతిని జనాలకు తెలియజెప్తామన్నారు. ఈమేరకు పార్టీ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. మరొక పెద్ద నిర్ణయాన్ని కూడా కేసిఆర్ ప్రకటించారు. సెప్టెంబరు 2న ప్రగతి సభ అయిపోగానే అదే నెలలో టిఆర్ఎస్ అభ్యర్థులను కూడా ప్రకటిస్తామని స్పష్టం చేశారు. అభ్యర్థుల ఎంపిక నిర్ణయాన్ని సమావేశంలో పార్టీ అధినేతకు అప్పగిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక కోసం పార్టీ నేత కేశవరావు నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీని ఏర్పాటు చేశామన్నారు. ప్రతి మూడు నియోజకవర్గాలకు ఒక కార్యదర్శి ఈ వ్యవహారంలో పాలుపంచుకుంటారని అన్నారు. పార్టీ కార్యదర్శులంతా యాక్టీవ్ కావాలని ఆదేశాలిస్తున్నట్లు చెప్పారు.

రాహుల్ గాంధీపై కేసిఆర్ తనదైన శైలిలో విమర్శల వర్షం కురిపించారు. రాహుల్ గాంధీ దేశంలో ప్రతిపక్ష పార్టీకి అధినేతగా వ్యవహరించాలన్నారు. ఆయన తన మెర్చ్యూరిటీ లెవల్స్ ఇంకా పెంచుకోవాలని సూచించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఎక్సెస్ బడ్జెట్ తో ఉన్నదని మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ గవర్నమెంటే లేదు కదా అని ఎద్దేవా చేశారు. రాహుల్ అలా మాట్లాడితే జనాలు నవ్వుకుంటారని అన్నారు. తెలంగాణలో ఉన్న వారందరికీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిస్తామని తాము హామీ ఇచ్చామని అనడం అవివేకమన్నారు. 27 లక్షల డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఇస్తామని తాము ఎక్కడా ప్రకటించలేదన్నారు. 2లక్షల 70వేల ఇండ్లు కట్టిస్తామని చెప్పాం. ఇండ్ల నిర్మాణం సాగుతున్నది అన్నారు. ఐదు వేల ఇండ్లు కూడా కట్టించలేదని మాట్లాడడం తగదన్నారు. రాహుల్ వస్తే ఎన్ని ఇండ్లు కట్టిస్తున్నామో తెలుస్తుందన్నారు. రాహుల్ లక్ష ఉద్యోగాలిస్తామన్నారు, ఇవ్వలేదని రాహుల్ మాట్లాడడం సరికాదన్నారు. వారు చెబుతున్నదంతా పచ్చి అబద్ధం అన్నారు. ఇప్పటికే మేము ఇచ్చిన ఉద్యోగాలు లక్ష దగ్గర దగ్గర దగ్గరకు వచ్చాయన్నారు.

రాహుల్ గాంధీ నోట కుటుంబ పాలన అని మాట్లాడితే ఏమన్నా ఉందా అని ఎద్దేవా చేశారు. ఢిల్లీ కుటుంబ పాలన కంటే మా కుటుంబ పాలన వంద శాతం బెటర్ అన్నారు. మీ కుటుంబ పాలన  ఎట్లుందో మా కుటుంబ పాలన గట్లే ఉన్నది అని విమర్శించారు. బానిస రాజకీయాలను ఎప్పుడో తెలుగు ప్రజలు బట్టబయలు చేశారన్నారు. ఎన్టీఆర్ కాలంలోనే బానిస రాజకీయాలకు చెక్ పెట్టారని చెప్పారు. ఢిల్లీకి బానిసలుగా ఉండడానికి ప్రజలు ఇక్కడ సిద్ధంగా లేరన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో పిసిసి ప్రసిడెంట్ కు స్వేచ్ఛ ఇస్తరా? అని ప్రశ్నించారు. కనీసం అభ్యర్థులను కూడా పిసిసి ప్రసిడెంట్ ఢిల్లీ పర్మీషన్ తోనే ప్రకటించాల్సిన పరిస్థితి ఉంటుందన్నారు. రాహుల్ గాంధీ ఇన్ మెర్చూర్డ్ గా మాట్లాడి అభాసుపాలు కావొద్దు అని సలహా ఇచ్చారు.

రాహుల్ గాంధీ ప్రతిపక్ష పార్టీకి అధ్యక్షుడు. రాహుల్ వస్తే కేసిఆర్ భయపడతాడని మాట్లాడడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేశారు. కేసిఆరా భయపడేది అని ప్రశ్నించారు. ఇప్పటి వరకు దాదాపు ఆరు, ఏడు డిఫరెంట్ సంస్థలతో సర్వేలు చేయించామన్నారు. అన్ని సర్వేల్లో టిఆర్ఎస్ కు వంద పైచిలుకు సీట్లు వస్తాయని తేలిందన్నారు. తాము సెప్టెంబరులోనే అభ్యర్థులను ప్రకటిస్తున్నా ముందస్థు, వెనకస్థు అన్నదానికి అర్థం లేదన్నారు. రెగ్యులర్ ఎన్నికలే ఇప్పుడు వస్తాయి తప్ప ముందస్థు ప్రశ్న ఉత్పన్నం కాదని తేల్చి చెప్పారు.

ఫెడరల్ ఫ్రంట్ నాన్ కాంగ్రెస్, నాన్ బిజెపి కూటమిగా ఉంటుందన్నారు. ఫెడరల్ ఫ్రంట్ ఆవశ్యకత కాంగ్రెస్, బిజెపిలకు అర్థం కాదన్నారు. ఈ రెండు పార్టీలు ఎంతకాలం జనాలను మోసం చేస్తాయని ప్రశ్నించారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏక కాలంలో రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేస్తామన్న ప్రకటన ఒక జోక్ అన్నారు. వాళ్లు ఎట్టి పరిస్థితుల్లో ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేయలేరన్నారు. వీళ్ల ముఖ్యమంత్రే పంజాబ్ లో ఉన్నాడు ఆయన చేయలేదు కదా అని ప్రశ్నించారు. రుణ మాఫీ విషయంలో కర్ణాటక ముఖ్యమంత్రి నా సలహా తీసుకున్నాడని అన్నారు. కర్ణాటకలో కూడా విడతల వారీగానే చేశారన్నారు. అసలు రాష్ట్ర ఖజానాకు వచ్చే ఆదాయం నెలకు 8,500 కోట్లు మాత్రమే. అటువంటప్పుడు రుణమాఫీ కోసం ఏం ఆపుతారు అని నిలదీశారు. చౌక బియ్యం ఆపుతారా? ఫీజు రీయంబర్స్ మెంట్ ఆపుతారా? ఇంకేమి ఆపుతారో చెప్పాలన్నారు.

ఉత్తమ్ కుమార్ రెడ్డి పదే పదే నిరుద్యోగ భృతి అంటున్నారు, అసలు నిరుద్యోగ భృతి గురించి వారి వద్ద ఏం లెక్క ఉంది అని ప్రశ్నించారు. ఎంత మంది నిరుద్యోగులు ఉన్నారు, ఎవరికి ఇస్తారు భృతి? అసలు ఎవరు నిరుద్యోగి అన్నది మీకు లెక్క ఉందా? అని నిలదీశారు. ఆంధ్రాలో చంద్రబాబు డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని చెప్పినప్పుడు మా పార్టీలో కూడా ఆ హామీ ఇద్దామన్నా నేను ఒప్పుకోలేదన్నారు. సాధ్యం కాని హామీలు, అబద్ధపు హామీలు ఇవ్వొద్దని చెప్పానన్నారు.

రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికల విషయంలో తమను ఒకే వ్యక్తి మద్దతు అడిగారని అందుకే వారికి ఇచ్చామన్నారు. నితీష్ కుమార్ నాకు గుడ్ ఫ్రెండ్ అని, ఆయన కోరినందుకే మద్దతు ఇచ్చామన్నారు. కాంగ్రెస్ వారు కనీసం మమ్మల్ని మద్దతు అడగలేదని తేల్చి చెప్పారు.