చంద్రబాబు సత్తాకు కితాబిచ్చిన పేర్ని నాని!

విమర్శలందు పేర్ని నాని విమర్శలు వేరయా అనేది ఏపీ రాజకీయాల్లో నానుడి! చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, సుత్తి లేకుండా చెప్పడం… విమర్శించాలనుకున్న వ్యక్తికి నొప్పి తెలియకుండా దింపడంలో పేర్ని నానిది అందెవేసిన చెయ్యి. ఈ క్రమంలో.. తాజాగా బందరు వెళ్లి మీటింగ్ పెట్టిన చంద్రబాబుపై తనదైన శైలిలో విమర్శల వర్షాలు కురిపించారు మాజీమంత్రి పేర్ని నాని!

ఏపీలో వైసీపీ పని అయిపోయిందని, టీడీపీదే ఇక రాజ్యమని చంద్రబాబు డప్పు కొట్టుకుంటున్నారని మొదలుపెట్టిన పేర్ని… వాస్తవంగా చంద్రబాబు సభలు, సమావేశాలు, రోడ్ షో లలో అసలు జనమే లేరని ఎద్దేవా చేశారు! ఇక మచిలీపట్నం వచ్చే నైతిక అర్హత చంద్రబాబుకి ఉందా అని ప్రశ్నించిన పేర్ని… బందరుని పోర్ట్ సిటీ చేస్తామని, రొయ్యల పరిశ్రమ తెస్తానని ప్రగల్భాలు పలికి, అవేమీ చేయకుండా ఇప్పుడు ఏ మొహం పెట్టుకుని మళ్లీ బందరు వచ్చారని ప్రశ్నించారు.

2019లో ప్రజలు చంద్రబాబుని వదిలేస్తే – 2023 నాటికి కేడర్ కూడా ఆయన్ను వదిలేసిందని చెబుతున్న పేర్ని… చంద్రబాబు సభలూ, సమావేశాలను చూసినవారెవరికైనా ఈ విషయం అర్థమవుతుందని చెప్పుకొచ్చారు. ఈ సందర్భంగా చంద్రబాబు సత్తాపై పేర్ని తనదైన శైలిలో సెటైర్ వేశారు. “ఖాళీ కుర్చీలకు కూడా సుమారు గంటన్నర సేపు మీటింగ్ చెప్పగల సత్తా ఉన్న ఏకైక నాయకుడు చంద్రబాబే” అని పేర్ని కితాబిచ్చారు.

ఇక గతంలో తన పాలన అద్భుతంగా ఉందని.. అదే పాలన జనాలు కోరుకుంటున్నారని నిజంగా బాబు నమ్మితే… ధమ్ముంటే… “అదే పాలన” మళ్లీ తెస్తానని ప్రజలకు చెప్పి చంద్రబాబు ఓట్లు అడగగలడా అని ప్రశ్నించారు! వెన్నుపోటు రాజకీయాలు, ప్రజల్ని మోసం చేసి రాజకీయాలు చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడని పేర్ని నాని ఎద్దేవా చేశారు. గతంలో జన్మభూమి కమిటీల పేరుతో యమ నొక్కుడు నొక్కారని.. వారి మేత చూసి ప్రజలు విసిగిపోయి జగన్ కి అధికారం కట్టబెట్టారని స్పష్టం చేశారు.

ఇదే క్రమంలో… జగన్ ని సైకో అంటున్న విషయాలపై స్పందించిన నాని… తోడల్లుడిని, వదినని మోసం చేసిన వాడిని సైకో అనక ఇంకేమంటారని – పిల్లనిచ్చినమామపై ఏమాత్రం జాలీ దయా లేకుండా వెన్నుపోటు పొడిచినవారిని సైకో అయన మరేమంటారని చంద్రబాబుకి కౌంటర్ ఇచ్చారు! బావ కోసం తండ్రిని కూడా కిరాతకంగా కూలదోసి, తడిగుడ్డతో పీక కోసిన వారిని సైకో అనక ఇంకేమంటారంటూ… పరోక్షంగా బాలకృష్ణపైనా పేర్ని సెటైర్లు వేశారు.