జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ ‘గాలితనం’ ప్రదర్శించారన్నది సర్వత్రా వినిపిస్తోన్న విమర్శ. ‘మనల్ని ఎవడ్రా ఆపేది..’ అనే ఆటిట్యూడ్లో భాగంగా ఇటీవల పవన్ కళ్యాణ్, వాహనం మీదకెక్కి కూర్చుని, హైవే మీద ప్రమాదకర రీతిలో ప్రయాణించిన సంగతి తెలిసిందే.
ఈ విషయమై వివాదం కొనసాగుతూనే వుంది. నిబంధనల ఉల్లంఘన కింద పవన్ కళ్యాణ్ మీద ఫిర్యాదు చేయాలనే ఆలోచనలో కొందరు వైసీపీ నేతలున్నారు. వైసీపీ తరఫున కాకుండా, రాజకీయాలతో సంబంధం లేని న్యాయవాదులతో కేసులు వేయిస్తే ఎలా వుంటుంది.? అన్న కోణంలో అధికార పార్టీ సమాలోచనలు చేస్తోందట.
సంబంధిత నిబంధనల ప్రకారం, అధికారులతో కేసులు వేయించడం కూడా సబబైన ఆలోచనేనన్న భావనలో వుందట అధికార వైసీపీ. ఒకవేళ కేసులు నమోదైతే, పవన్ కళ్యాణ్ ఎలా తాను చేసిన చర్యల్ని సమర్థించుకుంటారు.? ఇక్కడ నిజానికి పవన్ కళ్యాణ్ అభిమానులు కూడా, ఆ వ్యవహారాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.
జరగకూడనిది జరిగితే ఏంటి పరిస్థితి.? అని పవన్ కళ్యాణ్ అభిమానులు ఆందోళన చెందుతున్నారు. ‘సినిమాల్లో డూప్లను పెడతాం.. రోప్ వాడతాం.. గ్రాఫిక్స్ ఉపయోగిస్తాం.. హీరో విషయంలో అంత జాగ్రత్త తీసుకుంటాం. కానీ, ఈయనేంటి ఇలా చేశారు.? ఇలాగైతే ఆయన చేయాల్సిన సినిమాలేమైపోతాయ్.?’ అంటూ సినీ పరిశ్రమలోనూ చర్చ జరుగుతోంది.
కేసులు నమోదైతే పవన్ కళ్యాణ్ తనను తాను డిఫెండ్ చేసుకోలేని పరిస్థితి వస్తుందనీ, అది జనసేనకు రాజకీయంగా పెద్ద దెబ్బ అవుతుందనీ రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
