భగత్ సింగ్ 23 ఏళ్లకే దేశం కోసం ఆత్మహత్య చేసుకున్నారని పవన్ కల్యాణ్ తెలిపారు. దేశం కోసం ఆయన ప్రాణాలు అర్పించారని చెప్పారు. ప్రజలందరూ ఏకమైతే గొప్ప మార్పును తీసుకునిరాగలమని వ్యాఖ్యానించారు. అమెరికాలోని డల్లాస్ లో ఈరోజు జరిగిన ‘జనసేన ప్రవాస గర్జన’ సభలో పవన్ కల్యాణ్ మాట్లాడుతూ ఈ విషయాలు ప్రస్తావించారు. అయితే తొలితరం విప్లవ వీరుడిగా పేరుగాంచిన భగత్ సింగ్ను 1931, మార్చి 23న ఆనాటి తెల్లదొరలు ఉరితీసారని చరిత్ర చెప్తోంది.
పదే పదే భగత్ సింగ్ ని తన ఆదర్శంగా చెప్తూ…ఆయన గురించి మాట్లాడే పవన్ కళ్యాణ్ ఇలా ఆయన ఆత్మహత్య చేసుకున్నాడంటూ మాట్లాడటం అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. పొరపాటున పవన్ ఇలా అన్నారా లేక చరిత్రను మర్చిపోయారా అంటున్నారు.
ఇక ఇదే సభలో… రాజకీయ నేతల చేతకానితనం కారణంగానే యువత నిస్తేజంగా మారుతోందనీ, పోరాడాలన్న తత్వం తగ్గిపోతోందని జనసేన అధినేత పవన్ కల్యాణ్ తెలిపారు. యథా రాజా.. తథా ప్రజా అనే పరిస్థితి నిజంగానే ఏర్పడిందని వ్యాఖ్యానించారు. అమెరికాలో ఉన్న తెలుగువారు, భారతీయులందరూ కలిసి ఓ సంఘంగా ఏర్పడాలనీ, చిన్నచిన్న గ్రూపులుగా ఉంటే నష్టమేనని పేర్కొన్నారు.
అంతేకాకుండా…ఆంధ్రప్రదేశ్ లో లో పెట్టుబడి పెట్టడానికి అద్భుతమైన అవకాశాలు ఉన్నాయనీ, దాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. విస్తీర్ణంలో అనంతపురం అంతే ఉండే ఇజ్రాయెల్ ఇప్పుడు సాగునీటి రంగం, వ్యవసాయంలో అద్భుతాలు సృష్టిస్తోందని వెల్లడించారు. కానీ సారవంతమైన భూమి, జీవ నదులున్న మనం ఎందుకు చేయలేకపోతున్నామని జనసేనాని ప్రశ్నించారు.
