ఆంధ్రప్రదేశ్ ఆర్టీయే అధికారులు ‘వారాహి’ విషయమై ఒకింత ఆసక్తికరమైన వ్యాఖ్యలే చేస్తున్నారు. ఓ యూ ట్యూబ్ ఛానల్ నిర్వహించిన ఇంటర్వ్యూలో ఆర్టీయే ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ, ఆలివ్ గ్రీన్ రంగుతో వున్న ప్రైవేటు వాహనాలకు రిజిస్ట్రేషన్ చేసేది లేదని స్పష్టం చేసేశారు.
కానీ, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పరిచయం చేసిన ‘వారాహి’ వాహనానికి ఆలివ్ గ్రీన్ రంగుని పూసినట్లే కనిపిస్తోంది. ‘చాలా జాగ్రత్తలు తీసుకునే వాహనాన్ని తయారు చేయిస్తున్నాం. రిజిస్ట్రేషన్ సమస్యలేమీ వుండవు..’ అంటూ జనసేన నేత నాదెండ్ల మనోహర్, జరుగుతున్ వివాదంపై స్పందించారు.
‘వాహనాల రంగుల మీద ఫోకస్ పెట్టడం కంటే, ఏపీకి ప్రత్యేక హోదా వంటి అంశాల గురించి ప్రభుత్వంలో వున్నవారు ఆలోచిస్తే మంచిది. అయినా, వాహనాన్ని చూడకుండానే.. ఆ పేరు విని వైసీపీ నేతలెందుకు భయపడుతున్నారు..’ అని జనసేన నేత నాదెండ్ల సెటైర్ వేశారు.
కాగా, ‘వారాహి’ అంటే సాధారణ వాహనం కాదు. ఎన్నికల యుద్ధం కోసం తయారు చేసిన యుద్ధ ట్యాంకుగా దీన్ని అభివర్ణిస్తోంది జనసేన. ఈ వాహనం మీద నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తారట జనసేనాని. అయితే, కొనుగోలు చేసిన అసలు వాహనానికి చాలా మార్పులు చేశారు.
‘ప్రయాణీకుల వాహనం.. సరుకు రవాణా వాహనం.. ఈ రెండిటికీ తేడా వుంటుంది.. సరుకు రవాణా వాహనమైతే, అందులో ప్రయాణీకుల రవాణాకి అనుమతించబోం. టైర్ల దగ్గర్నుంచి, వాహన తయారీ సంస్థ నిర్దేశించిన అంశాలకు లోబడే ఆ వాహనం వుండాలి..’ అంటూ ఆర్టీయే అధికారి చెబుతున్నారు.
అలాంటప్పుడు, మార్పులు చేసిన వాహనానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అనుమతులు దక్కకపోవచ్చు. తెలంగాణలో అయితే, సీఎం కేసీయార్తో పవన్ కళ్యాణ్కి పంచాయితీ ఏమీ లేదు గనుక, అక్కడ పెద్దగా సమస్య వుండకపోవచ్చంటున్నారు.
