ఆంధ్రా ఐటి దాడుల్లో కొత్త ట్విస్ట్

ఆంధ్ర రాష్ట్రంలో గుంటూరు, విజయవాడ లో జరుగుతున్న ఐటి దాడుల్లో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఐటి అధికారులను మీడియా వెంబడించడం, టిడిపి శ్రేణులకు సమాచారం అందడంతో ఐటి అధికారులు ప్లాన్ బి ని అమలు చేసినట్లు వ్యక్తమవుతోంది. తొలుత విజయవాడ బెంజ్ సర్కిల్ లోని నారాయణ కాలేజీకి వెళ్ళింది ఐటి అధికారుల బృందం. అయితే వారిని మీడియా ఫాలో అవడంతో అక్కడి నుండి బండారు రోడ్డువైపుకు వెళ్లారు అధికారులు. కాగా వారు తమను ఫాలో కావొద్దని, మధ్యాహ్నం తర్వాత మేమే డీటెయిల్స్ అందిస్తామని తెలిపారు.

రాష్ట్రలో ఐతో సోదాలు జరుగుతున్నాయని వార్తలు బయటకు రావడం హాట్ టాపిక్ అయింది. టిడిపి నేతల్లో టెన్షన్ మొదలైంది. తమ సహచర నేతల ఆస్తులపై ఐటీ సోదాలు జరుగుతున్నాయని తెలిసి అలర్ట్ అయ్యారు. గురువారం రాత్రి చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ నుండి విజయవాడకు చేరుకున్నాయి ఐటీ బృందాలు. రాజధానిలో ఎంటర్ అవగానే గుంటూరు, విజయవాడ పోలీసు అధికారులకు సమాచారం అందించారు. వారికి భద్రత కల్పించమని ఐటి అధికారులు పోలీసు శాఖను కోరాయి.

ఇదిలా ఉండగా విజయవాడ నారాయణ కాలేజీల వద్దకు వచ్చిన అధికారుల బృందం అక్కడి నుండి మరో చోటికి వెళ్ళిపోయింది. నెల్లూరులోని మంత్రి ఇంటికి కూడా ఒక బృందం వెళ్లినట్లు తెలుస్తోంది. కాగా దీనిపై స్పందించిన మంత్రి నారాయణ వారి విద్యాసంస్థలపై ఎటువంటి దాడులు జరగలేదని వెల్లడించారు. ఐటి అధికారులు ఇంటికి వచ్చారన్న మాటలు అవాస్తవం అన్నారు. ఆ సమయంలో నేను ఇంట్లోనే ఉన్నానని, ఎవరూ రాలేదని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లోని నారాయణ కాలేజీలపై ఐటి సోదాలు జరగలేదని తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం మా పై ఐటీ దాడులు చేయించి మమ్మల్ని భయ బ్రాంతులకు గురి చేయాలని చూస్తున్నారు అని  అన్నారు. చెన్నైలో కూడా నేతల పై ఐటీ దాడులు చేయించి వారిని భయభ్రాంతులకు గురి చేసి చివరకు ముఖ్యమంత్రిగా ఎవరు కొనసాగాలో వారే అభ్యర్థిని కేటాయించారన్నారు. అలాగే కర్ణాటకలో కూడా అదే పరిస్థితి నెలకొందన్నారు. ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ నేతల పై ఐటీ దాడులు చేయించి భయభ్రాంతులకు గురిచేయాలని చూస్తుందన్నారు.

గుంటూరు జిల్లా టిడిపి నేతల ఆస్తులపై ఐటి దాడులు జరిగే అవకాశం ఉన్నట్టు ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి కారణం కొన్ని ఐటి బృందాలు విజయవాడ నుండి గుంటూరు వైపుగా వెళ్లడం అని తెలుస్తోంది. అయితే ఈ ఐటి దాడులపై కొత్త చర్చ నడుస్తోంది. తెలంగాణాలో కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనుచరుడు సెబాస్టియన్ బంధువు రణధీర్ రెడ్డి ఇంట్లో ఐటి సోదాలు అని చెప్పి కొందరు వ్యక్తులు వారికి సంబంధించిన విలువైన వస్తువులు తీసుకు వెళ్లిపోయారు. ఇప్పుడు ఏపీలో కూడా అదే తరహాలో ఏమైనా జరుగుతోందా అనే కోణంలో కూడా జనం చర్చించుకుంటున్నారు.

కాగా టిడిపి శ్రేణులు కొందరు ఇదంతా జగన్, బీజేపీ కలిసి పన్నిన కుట్ర అంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. బీజేపీ నుండి బయటకు వచ్చాక కేంద్ర ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలు చేస్తోందంటూ మండి పడుతున్నారు. ఈ వ్యాఖ్యలపై వైసిపి శ్రేణులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. అక్రమంగా సంపాదిస్తే ఐటి దాడులు జరుగుతాయి. ఇందులో వైసిపి కుట్ర ఏముందంటూ ప్రశ్నిస్తున్నారు.