లోకేష్ ప్రశ్నకు పంచ్: అది ఏపీనా.. బీహారా…?

గతకొన్ని రోజులుగా యువగళం అంటూ పాదయాత్ర చేస్తున్న చినబాబు లోకేష్… తండ్రి బాటలోనే పయనిస్తున్నారని.. ఆయన ఏమి చెబితే అదే తప్ప… బోలేడు భవిష్యత్త్ ఉన్న యువనాయకుడు కూడా బ్లైండ్ గా మాట్లాడేస్తున్నారనే కామెంట్లు గత కొన్ని రోజులుగా ఏపీ రాజకీయవర్గాల్లో వినిపిస్తున్నాయి. ఏపీలో ఏ గొడవ జరిగినా.. ఎవరు ఎవరిపై దాడులు చేసుకున్నా.. ముందుగా ఎవరు కవ్వించినా.. ఎవరు రాయి విసిరినా.. ఆ బురద మరెవరిపై పడినా… ఇది పూర్తిగా వైసీపీ కుట్ర అని ఫైరవుతున్నారు చంద్రబాబు. అక్కడితో ఆగకుండా… అసలు మనం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నామా అంటూ పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు! చినబాబు కూడా వీటినే ఫాలో అవుతున్నారు.. ఫలితంగా పెద్ద పెద్ద ప్రశ్నలే ఎదుర్కొంటున్నారు! ఆవు చేలో మేస్తే.. దూడ గట్టునమేస్తుందా బాబు అనే ప్రశ్నకు ఛాన్స్ ఇస్తున్నారు!

తాజాగా ఉమ్మడి అనంత‌పురం జిల్లా పుట్టపర్తిలో వైసీపీ – టీడీపీ నేత‌ల మ‌ధ్య స‌వాళ్ల ప‌ర్వం ఉద్రిక్తతకు దారి తీసిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇరుపార్టీల నాయ‌కులు, కార్యకర్తలు పరస్పరం రాళ్లు, చెప్పులు విసురుకున్నారు.. కలబడి కొట్టుకున్నారు. ఇదంతా మీడియా కెమెరాల్లో నిక్షిప్తమై ఉంది. ఇప్పటికే ఏ వర్గం మీడియా ఆ వర్గానికి సపోర్ట్ గా వీడియోలు ప్రసారం చేసుకుంటుంది. రెండు వర్గాల టీవీ ఛానల్లు చూసినవారికి వాస్తవం కళ్లకు కట్టినట్లు కనిపిస్తుంది. ఫలితంగా… ఏ నాయ‌కుడైనా బుకాయించాల‌ని ప్రయత్నించినా వెంట‌నే దొరికిపోయే పరిస్థితి. వాస్తవం ఇలా వుంటే… చంద్రబాబు స్పందన, దానికనుగుణంగా.. ఖండ‌న మాత్రం భిన్నంగా వుంది.

“పుట్టపర్తిలో మాజీ మంత్రి పల్లె రఘునాథ్‍ రెడ్డి వాహనంపైనా, టీడీపీ కార్యకర్తలపైనా.. వైసీపీ రౌడీలు చేసిన దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రశ్నించిన ప్రతిపక్షాలపై ప్రతిరోజూ దాడులు సమాధానం కాలేవు. వైసీపీ దాడుల వెనుక వారి ఓటమి భయం, ఫ్రస్ట్రేషన్ కనిపిస్తుంది” అంటూ చంద్రబాబు ట్వీట్ చేశారు. అది అక్కడితో ఆపితే సరిపోయేది… ఈ సంద‌ర్భంగా ఆయన ఓ వీడియోని కూడా షేర్ చేశారు. విచిత్రం ఏమిటంటే… ఆ వీడియోలో కూడా వైసీపీ వాళ్లే ఏకపక్షంగా దాడులు చేసిన‌ట్టు ఎక్కడా లేదు! కానీ… బాబు మాత్రం ఇది వన్ సైడ్ వార్ అంటున్నారు!

దీంతో… ఈ వీడియోలో… ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డే కారు పైకి ఎక్కి స‌వాల్ విసురుతున్నట్లు విజువ‌ల్స్ ఉన్నాయి. పుట్టపర్తి ఎమ్మెల్యే శ్రీ‌ధ‌ర్‌ రెడ్డి మాత్రం సైలెంట్‌ గా అన్ని చూస్తూ ఉండ‌డాన్ని గ‌మ‌నించొచ్చు. గొడ‌వ‌కు దిగాల‌నే ఉద్దేశంతోనే ప‌ల్లె ర‌ఘునాథ‌రెడ్డి త‌న అనుచ‌రుల‌తో వ‌చ్చార‌ని చెబుతున్నారు. అలాంట‌ప్పుడు ఒక వైపు నుంచే ఏక‌ప‌క్ష దాడుల‌కు ఎలా సాధ్యమో చంద్రబాబే స‌మాధానం చెప్పాలి అని ప్రశ్నిస్తున్నారు విశ్లేషకులు.

ఇలా అన్నింటికీ ఒకటే విమర్శ చేయడం, సేం స్క్రిప్ట్ చదివినట్లు స్పందించడం వల్ల… ఆ విమర్శల్లో వాస్తవాలున్నా కూడా అవి కూడా అసత్య ఆరోపణలుగా – రాజకీయ విమర్శలుగా మిగిలిపోయే ప్రమాధం ఉందని.. అది చంద్రబాబు గ్రహించాలని.. మనం ఎన్ని చెప్పినా స్థానికంగా చూసే ప్రజలకు అన్నీ తెలుసన్న విషయం మరిచిపోకూడదని సూచిస్తున్నారు మేధావులు!

విచిత్రం ఏమిటంటే… ఈ గొడవలపై స్పందించిన చినబాబు లోకేష్… “ఇది ఏపీనా? బీహారా?” అని ప్రశ్నిస్తున్నారు. దీంతో… లోకేష్ పై ప్రశ్నల వర్షాలు కురిపిస్తున్నారు నెటిజన్లు!

ఎమ్మెల్యే వనజాక్షిని ఇసుకలో వేసి తొక్కిన టీడీపీ ఎమ్మెల్యేని అడుగు… తమ పాలనలో నాడు అది ఏపీనా బీహారా అని?

కాల్ మనీ సెక్స్ రాకెట్ లో మహిళల మానప్రాణాలతో చెలగాటమాడుతూ… విక్రమార్కుడు సినిమాలోని విలన్ బావూజీ లా ప్రవర్తించిన నేతలనడుగు… నాడు అది ఏపీనా బీహారా అని?

దళితులను అవమానపరుస్తూ బుద్దిలేకుండా మాట్లాడినవాళ్లను – జీతాలు పెంచమన్న నాయీ బ్రాహ్మణుల తోకలు కత్తిరిస్తానవాళ్లను అడుగు… ఇది ఏపీనా బీహారా అని?

జన్మభూమి కమిటీల పేరుతో గ్రామాల్లో అరాచకాలు సృష్టించినవారిని అడుగు.. నాడు అది ఏపీనా బీహారా అని?

ఇచ్చిన హామీలు నెరవేర్చమని రోడ్లపైకి వచ్చిన జనాలపై లాఠీలు విరగొట్టించిన పెద్దలను అడుగు… నాడు అది ఏపీనా బీహారా అని?

షూటింగుల మాయలో పడి పుష్కరాల్లో జనాలు తొక్కిసలాటల మధ్య ఉక్కిరిబిక్కిరై ఊపిరాడకుండా చనిపోవడానికి కారణమైన వారిని అడుగు… ఇది ఏపీనా బీహారా అని?

అలాంటి ఎన్నో “షో”కులకుపోయి ప్రజల ప్రాణాలతో ఆడుకుంటూ.. ఆనాక ఆ వ్యవహారాన్ని మాయం చేసి, ఏ ఒక్కరినీ నేరస్తులుగా చూపించకుండా కనుమరుగుచేసినవారిని అడుగు నాడు అది ఏపీనా బీహారా? అంటూ.. చెలరేగిపోతున్నారు నెటిజన్లు – వైకాపా సోషల్ మీడియా జనాలు!