పవన్ సీఎం అయిన మరుక్షణం ఏమి చేస్తారో చెబుతున్న నాగబాబు!

గతంలో పొలిటికల్ గా ఫుల్ యాక్టివ్ గా ఉన్నట్లు కనిపించిన నాగబాబు.. గత కొంతకాలంగా హడావిడి చేయడం లేదు. పెద్ద పదవిని తమ్ముడు ఇవ్వడంతో పెద్ద మనిషిగా మారిపోయారో ఏమో కానీ… ట్విట్టర్ వేదికగా స్థాయి మరిచిన సెటైర్స్ ఈ మధ్య మానేశారు.. హుందాగా వ్యవహరిస్తున్నారు. అయితే ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి అయిన తర్వాత చేసే పనిపై సంచలన వ్యాఖ్యలు చేశారు నాగబాబు.

“టీటీడీలో తప్పకుండా పారదర్శకత ఉండాలి. టీటీడీ నిర్వహణలో జవాబుదారీతనం తప్పనిసరి. జనసేన అధినేత పవన్ కల్యాణ్ సీఎం అయిన మరుక్షణమే.. టీటీడీ ధర్మకర్తల మండలి, హిందూ ధార్మిక సంస్థలు, అత్యధిక మంది భక్తుల అభిప్రాయాలను సేకరిస్తాం. ఇంతకాలం కాగితాలకే పరిమితమైన స్వయం ప్రతిపత్తి అనేది ఎలా ఉంటుందో ఆచరణలో చేసి చూపిస్తాం” అని నాగ‌బాబు తెలిపారు. దీంతో… కీబోర్డులకు పనిచెబుతున్నారు నెటిజన్లు.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… పవన్ కల్యాణ్ తప్ప… జనసేనలో మిగిలిన వారంతా పవన్ సీఎం అవుతారనే అనుకుంటున్నారు.. అవ్వాలని బలంగా కోరుకుంటున్నారు. కానీ చిత్రంగా పవన్ మాత్రం… చంద్రబాబుని సీఎం చేయాలని తపనపడుతున్నారు.. నిత్యం మదనపడుతున్నారు. పైకి ప్రభుత్వ వ్యతిరేఖ ఓటును చీలనివ్వనంటూ.. చంద్రబాబు చీటీ చిరగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

అయితే… తాజాగా నాగబాబు చేసిన కామెంట్లతో… “టీడీపీ – జనసేనల పొత్తు విషయం నాగబాబు తెలియదా” అనే పశ్నలు లేవనెత్తుతున్నారు నెటిజన్లు. “అన్నకు పార్టీలో అంత పెద్ద పదవి ఇచ్చినా కూడా… బాబుతో పొత్తు విషయంలో జరిపిన చర్చలు అన్నకు చెప్పడం లేదా..” అనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. రాబోయే ఎన్నికల్లో ఒంటరిగా వెళ్తే వీరమరణమే అని స్పష్టత కలిగిన పవన్… బాబు చంకనెక్కి అసెంబ్లీ గేటు తాకాలని ఆలోచిస్తుంటే… పాపం నాగబాబేమో నిజమైన జనసేన కార్యకర్తలు కోరుకున్నట్లు… “సీఎం గా పవన్” అని మాట్లాడుతున్నారన్ని అంటున్నారు!