నాగబాబుతో రోజా.. బాలకృష్ణతో పవన్ కళ్యాణ్.! తేడా ఏంటి.?

‘ఆహా అన్‌స్టాపబుల్ టాక్ షో’లో బాలకృష్ణని పవన్ కళ్యాణ్ కలిస్తే, టీడీపీ అధినేత నారా చంద్రబాబునాయుడు ప్యాకేజీ ఇచ్చినట్లు. మరి, ఈనాడు రామోజీరావుకి చెందిన ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కామెడీ షోలో నాగబాబుతో రోజా కలిసి వర్క్ చేస్తే.. దాన్ని ఏమనాలి.?

రాజకీయాలన్నాక విమర్శలు మామూలే. అలాంటి విమర్శలు చేయడంలో రోజా ఫైర్ బ్రాండ్.! మంత్రి అయ్యాక కూడా అదే దూకుడు కొనసాగుతోంది. కానీ, రోజా నానాటికీ తన ‘ప్రభ’ కోల్పోతున్నారు.

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న అన్‌స్టాపబుల్ టాక్ షో‌కి జనసేన అధినేత, సినీ నటుడు పవన్ కళ్యాణ్ హాజరైతే అందులో వింతేముంది.? వైసీపీ ఈ విషయాన్ని ఎందుకు ‘వక్ర కోణం’లో చూస్తోంది. నిజానికి, ఈ టాక్ షో గురించి వైసీపీ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది.

ఇద్దరూ సినీ పరిశ్రమకి చెందిన ప్రముఖులు.. పైగా, రాజకీయాల్లో కూడా వున్నారు. వాస్తవానికి సినీ, రాజకీయ వైరం.. బాలకృష్ణ, పవన్ కళ్యాణ్ మధ్యనే చాలాకాలంగా వుంది. కానీ, అల్లు అరవింద్ భాగస్వామిగా వున్న ‘ఆహా’ ఓటీటీ‌కి స్టార్ డమ్ అద్దే క్రమంలో ఈ కలయికని ప్లాన్ చేశారు. ఇంతకు మించి, ఈ టాక్ షో వల్ల రాజకీయాలు ప్రభావితమైపోతాయనుకుంటే అంతకన్నా హాస్యాస్పదదం ఇంకోటుండదు.

బాలకృష్ణ – పవన్ కళ్యాణ్ కేవలం ప్యాకేజీ వల్లనే కలిశారనుకుంటే, రోజా గతంలో ఈటీవీ కోసం పనిచేశారు.. చిరంజీవిని తరచూ కలుస్తున్నారు.. మరి, అక్కడ ప్యాకేజీ విమర్శలు వర్తించవా.?