వారాహి యాత్ర… కొడాలి కోటా కూడా పూర్తి… తెరపైకి నవనీత్ కౌర్!

వారాహి యాత్రతో గోదావరి జిల్లాల్లోని జనసైనికుల్లో కొత్త ఉత్సహం తేవడానికి ప్రయత్నిస్తూ.. ఈసారి ఎలాగైనా ఎమ్మెల్యే అవుతానంటూ శపథం చేశారు జనసేన అధినేత పవన్ కల్యాణ్. వారాహి యాత్రలోని తొలి బహిరంగ సభాలో మాట్లాడిన ఆయన… ఈ సందర్భంగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పైనా, ఆయన ప్రభుత్వం పైనా తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

ఈ సందర్భంగా పవన్ వ్యాఖ్యలపై ఇప్పటికే మాజీమంత్రి, మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నాని ఫైరయ్యారు. రెండు చెప్పులూ చూపిస్తూ, మక్కెలు ఇరుగుతాయంటూ, బోసిపోలు కబుర్లు చెప్పొద్దంటూ తన కోటా పూర్తి చేశారు. అనంతరం మైకుల ముందుకొచ్చిన మంత్రి అంబటి కూడా… పవన్ స్థాయిపై ఎద్దేవా చేశారు. ఈ సందర్భంగా కొడాలి నాని కూడా తన కోటాను తనదైన శైలిలో జగన్ సమక్షంలో ఇచ్చిపాడేశారు.

అవును.. గుడివాడ టిడ్కో గృహాల పట్టాల పంపిణీ కార్యక్రమం సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మైకందుకున్న కొడాలి… నిప్పులు చెరిగారు. చంద్రబాబుకు దమ్ముంటే గుడివాడ నుంచి పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. ఇళ్ల పట్టాల కోసం చంద్రబాబు ఒక ఎకరం ఇచ్చినట్లు నిరూపించినా తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానంటూ ఫైరైపోయారు.

అనంతరం పవన్ ప్రస్థావన తెచ్చిన కొడాలి… అసెంబ్లీలో అడుగు పెట్టడానికి పవన్ కల్యాణ్‌ పార్టీ పెట్టాడంటూ ఎద్దేవా చేశారు. హీరోయిన్లు నవనీత్ కౌర్, సుమలత ఇండిపెండెట్లుగా పోటీచేసి గెలిస్తే… ఈ సూపర్ స్టార్, మెగాస్టార్ మాత్రం 16పార్టీలను కలుపుకున్నా కూడా ఎమ్మెల్యేగా గెలవలేకపోయాడని సెటైర్స్ వేశారు.

అనంతరం… సీఎం అవుతానని పార్టీ పెట్టిన పవన్‌ కళ్యాణ్‌.. జగన్‌ దెబ్బకు ఎమ్మెల్యే కావడమే లక్ష్యంగా పెట్టుకున్నారని, టీడీపీ-బీజేపీ లను కలుపుకున్నా కూడా కనీసం ఎమ్మెల్యే అయ్యే పరిస్థితి లేద‌ని తేల్చి చెప్పారు. ప్రస్తుతం పవన్ పై కొడాలి వ్యాఖ్యలు ఆన్ లైన్ వేదికగా వైరల్ అవుతున్నాయి!