చంద్రబాబు వెన్నుపోటు పొడుస్తారేమో.! జనసైనికుల భయం ఇదే.!

2014 ఎన్నికల సమయంలో జనసేన పార్టీని టీడీపీ గట్టిగా వాడేసింది. బీజేపీ కూడా అంతే. కానీ, చివరికి టీడీపీ – బీజేపీ అధికారం పంచుకున్నాయి.. జనసేన పార్టీ ఆ అధికారాన్ని కోరుకోకపోయినా, తగిన గౌరవమూ జనసేన పార్టీకి ఆ రెండు పార్టీలు ఇవ్వలేకపోయాయి.

2024 ఎన్నికలకు సంబంధించి టీడీపీ – జనసేన కలవడం దాదాపు ఖాయమైపోయింది. ఈ రెండు పార్టీలూ కలవకూడదని వైసీపీ కోరుకుంటోంది. కానీ, అది కుదిరేలా లేదు. బీజేపీ ఇప్పుడు ఎటువైపు వుంటుందన్నది ప్రస్తుతానికి సస్పెన్స్.

ఆ సంగతి పక్కన పెడితే, టీడీపీతో కలిసి వెళ్ళడం వల్ల ప్రయోజనమేమీ లేదన్న భావన జనసైనికుల నుంచి వ్యక్తమవుతోంది. ‘వ్యూహాన్ని నాకు వదిలెయ్యండి..’ అని జనసేన అధినేత పదే పదే జనసైనికులకు క్లాస్ పీకుతుంటారు. దానికి కట్టుబడి వుండిపోతుంటారు జనసైనికులు.

‘మళ్ళీ టీడీపీ జెండాని మనం మొయ్యాల్సిందేనా.? మనకు గౌరవం దక్కని చోట, ఎందుకు వంగి వంగి వుండాలి.?’ అని జనసైనికులు ప్రశ్నిస్తున్నారు. కానీ, ఒంటరిగా వెళితే వచ్చే నష్టమేంటో, ఆయా సర్వేల ఫలితాల్ని బట్టి జనసేనాని ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చినట్లు తెలుస్తోంది.

‘సీట్లు గెలుచుకున్నా ప్రయోజనం వుండదు.. చంద్రబాబు మళ్ళీ అధికారంలోకి వస్తే, మిత్రపక్షం అని కూడా చూడకుండా వెన్నుపోటు పొడుస్తారు..’ అంటూ సోషల్ మీడియా వేదికగా జనసైనికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి, జనసేన అధినేత ఈ ‘వెన్నుపోటు’ కోణాన్ని పరిగణనలోకి తీసుకుంటారా.? లేదా.?