టిడిపిలో తీవ్ర పోటి..వైసిపి సేఫేనా ?

వచ్చే ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి సంబంధించి రాజంపేట పార్లమెంటు స్ధానానికి గట్టి పోటీ కనిపిస్తోంది. టిడిపి హిస్టరీలో  ఈ స్ధానం నుండి రెండు సార్లు మాత్రమే గెలిచింది. అయినా సరే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తామంటూ పలువురు నేతలు పోటీ పడుతున్నారంటే గెలుపుపై ఎంతటి దీమా ఉందో అర్ధమవుతోంది. ఈ స్ధానానికి ఇప్పటి వరకూ ఎనిమిదిసార్లు ఎన్నికలు జరిగాయి. అందులో 1984లో సుగవాసి పాలకొండరాయుడు, 1999లో గునిపాటి రామయ్య టిడిపి తరపున గెలిచారు. ఇక ఐదుసార్లు కాంగ్రెస్ పార్టీ తరపున సాయిప్రతాప్, వైసిపి తరపున మిథున్ రెడ్డి ఒకసారి గెలిచారు.

 

నిజానికి రాజంపేట నియోజకవర్గంలో టిడిపి ట్రాక్ రికార్డు ఏమంతా బావోలేదు. అయినా ఇపుడు పోటీ పడుతున్నారంటే చంద్రబాబునాయుడు మీద నమ్మకంతోనే. అందుకనే చంద్రబాబు కూడా గట్టి అభ్యర్ధి కోసం పెద్ద కసరత్తే చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని ఏడు అసెంబ్లీ స్ధానాల్లో చిత్తూరు జిల్లాలో పుంగనూరు, పీలేరు, తంబళ్ళపల్లె, మదనపల్లె నియోజకవర్గగాలు, కడపలో రాజంపేట, రైల్వేకోడూరు, రాయచోటి ఉన్నాయి. కాబట్టి ఏ అభ్యర్ది గెలవాలన్నా రెండు జిల్లాల్లోని ఏడు నియోజకవర్గాలు ముఖ్యమే అని అర్ధమైపోతోంది.

 

అయితే, ఈ నియోజకవర్గంలోని కడపలో ఉన్న మూడు స్ధానాల్లో బలిజ  సామాజికవర్గం జనాభా ఎక్కువ. కాబట్టి అభ్యర్ధిని చిత్తూరు జిల్లా నుండా కాకుండా కడప జిల్లా నుండే ఎంపిక చేయాలని చంద్రబాబు నిర్ణయించారు. అందుకనే కడప జిల్లా నేతలతోనే చంద్రబాబు మాట్లాడుతున్నారు. పోయిన ఎన్నికల్లో మిథున్ రెడ్డికి 6లక్షల ఓట్లు వస్తే, మిత్రపక్షాల అభ్యర్ధిగా నిలబడిన పురంధేశ్వరికి 4.27 లక్షల ఓట్లు వచ్చాయి. మిథున్ కు వచ్చిన 1.75 లక్షల ఓట్ల మెజారిటీలో ప్రధానంగా పుంగనూరులో రామచంద్రారెడ్డికి వచ్చిన మెజారిటీనే ముఖ్య పాత్ర పోషించిందనటంలో సందేహం అక్కర్లేదు. రాబోయే ఎన్నికల్లో కూడా మిథున్ పుంగనూరే ఆదుకోవాలి.

 

రాజంపేట నుంచి ఈసారి టిడిపి తరపున ఎంఎల్సీ బత్యాల చెంగల్రాయలు ఆసక్తి చూపటం లేదని సమాచారం. కాకపోతే బలిజ సామాజికవర్గంలో బత్యాల గట్టి నేతల్లో ఒకరుగా పేరుంది. ఇక, ఐదుసార్లు కాంగ్రెస్ తరపున గెలిచిన సాయిప్రతాప్ పేరు కూడా పరిశీలనలో ఉంది. ఈయన కూడా బలిజ సామాజికవర్గమే. అదే సమయంలో కడప లోక్ సభ నుండి పోటీ చేయాలనుకుంటున్న జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసుల రెడ్డి పేరు కూడా రాజంపేటకు పరిశీలిస్తున్నారు. ఎలాగైనా వచ్చే ఎన్నికల్లో రాజంపేటలో టిడిపి జెండా ఎగరేయాలన్నది చంద్రబాబు పట్టుదలగా కనిపిస్తోంది. మరి ఏమవుతుందో చూడాల్సిందే.