చంద్రబాబుకు హై కోర్టు షాక్

పంచాయితీ ఎన్నికల విషయంలో చంద్రబాబునాయుడుకు హై కోర్టు పెద్ద షాకే ఇచ్చింది. మూడు నెలల్లో రాష్ట్రంలో పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ స్పష్టమైన ఆదేశాలిచ్చింది. నాలుగున్నరేళ్ళ పాలనలో చంద్రబాబుపై  గ్రౌండ్ లెవల్లో బాగా వ్యతిరేకత పెరిగిపోతోంది.  షెడ్యూల్ ఎన్నికలకు ముందు జరగాల్సిన పంచాయితీ ఎన్నికల్లో ఆ విషయం బయటపడితే రేపటి సాధారణ ఎన్నికల్లో ఇబ్బందులొస్తాయని చంద్రబాబు ప్రభుత్వం భావించింది.

 

అందుకనే ప్రజా వ్యతిరేకత బయటపడకుండా పంచాయితీ ఎన్నికల నిర్వహణను వాయిదా వేసింది. మొన్నటి ఆగష్టులోనే పంచాయితీ 12,918 పంచాయితీలకు ఎన్నికలు జరగాల్సుంది. స్పెషల్ అధికారుల పాలనను అమల్లోకి తేవటం ద్వారా ఎన్నికలను తప్పించుకున్నారు.

 

సరే, తర్వాత ఇదే విషయమై సర్పంచుల సంఘంలోని కొందరు కోర్టుకెక్కారు. పంచాయితీల్లో రిజర్వేషన్లు తేల్చకుండా గతంలో కోర్టే చెప్పింది. దాని సాకుగా తీసుకుని ఎన్నికలను వాయిదా వేస్తోంది ప్రభుత్వం. కానీ  ఆ విషయాన్ని పక్కనపెట్టేసి తాజాగా కేసును విచారించిన హైకోర్టు మూడు నెలల్లోగా అంటే జనవరి 23వ తేదీలోగా పంచాయితీ ఎన్నికలు నిర్వహించాల్సిందేనంటూ ఆదేశాలివ్వటమంటే చంద్రబాబు ప్రభుత్వానికి షాకనే చెప్పాలి.

 

ఇక్కడే ఓ విషయం చెప్పుకోవాలి. ఇదే విధమైన తీర్పు తెలంగాణా ప్రభుత్వం విషయంలో కూడా కోర్టు చెప్పింది. కాకపోతే పంచాయితీ ఎన్నికలు నిర్వహించేనాటికి తెలంగాణాలో ముందస్తు ఎన్నికలు అయిపోతాయి. కాబట్టి ప్రజా వ్యతిరేకతున్న బయటపడే అవకాశం లేదు.

 

కానీ, ఏపిలో అలాకాదు. రాష్ట్రంలో షెడ్యూల్ ఎన్నికలు జరగాల్సింది మే నెలలో. కోర్టు తీర్పు ప్రకారం ఎన్నికలు జరపాల్సింది జనవరిలోనే. అంటే షెడ్యూల్ ఎన్నికలకన్నా మూడు నెలల ముందే పంచాయితీ ఎన్నికలు జరిగిపోతాయి. నిజంగానే పంచాయితీ ఎన్నికల్లో తెలుగుదేశంపార్టీకి గట్టి దెబ్బే పడితే తర్వాత జరిగే షెడ్యూల్ ఎన్నికల్లో దాని ప్రభావం పడక తప్పదు.

 

ప్రజా  వ్యతిరేకత బయటపడకూడదనే పంచాయితీ ఎన్నికలు వాయిదా వేసింది. కానీ చంద్రబాబు ప్రయత్నాలను కోర్టు అడ్డుకుంది. కోర్టు తీర్పు నేపధ్యంలో చంద్రబాబు ప్రభుత్వం ఏం చేస్తుందా చూడాల్సిందే.