వైఎస్ఆర్ కాంగ్రెస్ అధినేత, ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కీలక అడుగు వేసింది. దాల్మియా సిమెంట్స్ సంస్థకు చెందిన రూ.793 కోట్ల విలువైన ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. వీటిపై ఇకపై ఎలాంటి ఆర్థిక లావాదేవీలు చేయాలన్నా ఈడీ అనుమతి తప్పనిసరి. ఒకరకంగా ఈడీ చర్యలు జగన్ కేసుకు సంబంధించి కీలక మలుపు తిరిపించాయి.
ఇప్పుడు అటాచ్ అయిన దాల్మియా సిమెంట్స్ ఆస్తులకు సంబంధించి కేసు నేపథ్యం ఇది.. వైఎస్ హయాంలో దాల్మియా సంస్థకు కడపలోని సున్నపురాయి గనుల అనుమతులు ఇవ్వడం జరిగింది. దాంతో కంపెనీ భారీగా పెట్టుబడులు పెట్టింది. అయితే, దాల్మియా కంపెనీ జగన్కు చెందిన సంస్థలలో పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా రఘురామ్ సిమెంట్స్లో దాల్మియా కంపెనీ రూ.95 కోట్లు షేర్ల రూపంలో పెట్టినట్లు ఈడీ పేర్కొంది.
దీని బదులుగా జగన్ ప్రభుత్వం నుంచి ఈ కంపెనీకి లబ్దులు లభించాయని ఈడీ ఆధారాలతో తెలిపింది. అలాగే మరో రూ.55 కోట్లు నేరుగా మనీ లాండరింగ్ రూపంలో పంపినట్లు కూడా ఆరోపణ ఉంది. మొత్తం మీద దాల్మియా సంస్థ జగన్ సంస్థలకు రూ.150 కోట్ల మేర సాయం చేసినట్లు పేర్కొంది. ఈ కేసు ప్రస్తుతం కోర్టులో విచారణలో ఉంది. కానీ తాజా ఆస్తుల అటాచ్ నిర్ణయం జగన్ అక్రమాస్తుల కేసులో మరో కీలక మలుపుగా మారింది. ఇకపై దాల్మియా సంస్థ ప్రతి రూపాయికి లెక్కలు చూపించాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ పరిణామం జగన్ కేసును మరింత వేడెక్కించే అవకాశం ఉంది.