అసెంబ్లీలో ఎంతమందిపై కేసులున్నాయో తెలుసా ?

చట్టాలు చేసే ప్రజాప్రతినిధులకు క్లీన్ రికార్డుండాలని జనాలు అనుకుంటారు. కానీ ఏపిలోని 175 మంది ఎంఎల్ఏల్లో సుమారు 82 మంది క్రిమినల్ కేసులు ఎదుర్కొంటున్నారంటే నమ్మగలరా ? కానీ అది నిజ్జంగా నిజం.  ఎలాగంటే పోయిన ఎన్నికల సమయంలో ఎన్నికల సంఘానికి సమర్పించిన అఫిడవిట్లో స్వయంగా వారే సమర్పించిన వివరాలు కాబట్టి నమ్మాల్సిందే. తమ సమస్యల పరిష్కారం కోసం మాత్రమే ప్రజాప్రతినిధులు చట్టసభల్లోకి ప్రవేశించాలని కోరుకోని జనాలుండరు. కానీ అలా జరుగుతోందా ? లేదనే చెప్పాలి.

 

అసోసియేషన్ ఫర్ డెమొక్రటిక్ రిఫార్మ్స్ (ఏడిఆర్) తాజాగా విడుడల చేసిన నివేదిక చూస్తే దిమ్మతిరగాల్సిందే. నివేదిక ప్రకారం చూస్తే కేసులున్నవాళ్ళు చట్టసభల్లోకి నిర్భయంగా ప్రవేశిస్తున్నారు. అదేవిధంగా ప్రజా ప్రతినిధులైన తర్వాత కూడా కొందరు అడ్డదిడ్డమైన డబ్బు సంపాదనే ధ్యేయంగా అనేక విషయాల్లో ఇరుక్కుని కేసులను ఎదుర్కొంటున్నారు. ఇక ప్రస్తుతానికి వస్తే ఏపి అసెంబ్లీలో 175 స్ధానాలున్నాయి. అందులో దాదాపు సగంమంది ఎంఎల్ఏలు నేరచరిత్ర ఉన్న వారే అంటే నిజంగా సిగ్గుపడాల్సిన అంశమే. దాదాపు 82 మంది ఎంఎల్ఏలు వివిధ కేసులను ఎదుర్కొంటున్నారు. అందులో తీవ్రమైన నేరాలను ఎదుర్కొంటున్న వారు కూడా ఉన్నారంటే ఆశ్చర్యమేస్తుంది. పైగా ఎంఎల్ఏలపై ఉన్న కేసులను ఎత్తేయటానికి చంద్రబాబునాయుడు ఏకంగా జీవోలే జారీ చేయటం నిజంగా బాధాకరం.

 

కేసులెదుర్కొంటున్న 82 మంది ఎంఎల్ఏల్లో అత్యధికులు తెలుగుదేశంపార్టీ వారే కావటం గమనార్హం. టిడిపిలో 52 మంది ఎంఎల్ఏలు కేసులను ఎదుర్కొంటుండగా ప్రధాన ప్రతిపక్షం వైసిపి కూడా పోటీ పడుతున్నట్లుంది. వైసిపిలో 29 మంది ఎంఎల్ఏలపై కేసులున్నాయి. ఇతరుల్లో ఇద్దరు ఎంఎల్ఏలు కూడా కేసులెదుర్కొంటున్నారు. ఇక ఎంపిలు కూడా ఎంఎల్ఏలతో పోటీ పడుతున్నారు. 25 మంది ఎంపిల్లో టిడిపికి చెందిన 15 మంది ఎంపిలు లీడింగ్ లో ఉండగా నలుగురు వైసిపి ఎంపిలపైన కూడా కేసులున్నాయి. బిజెపి ఇద్దరిలో ఒకరిపై కేసుంది లేండి. బహుశా వచ్చే ఎన్నికల్లో పోటీ పడే టిడిపి నేతల అఫిడవిట్లు చూస్తే కళ్ళు తిరుగుతాయేమో ?