తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబునాయుడు వచ్చే ఎన్నికల్లో ‘పొత్తులపై’ అనుసరించాల్సిన వ్యూహానికి సంబంధించి మల్లగుల్లాలు పడుతున్నారు. పార్టీ సీనియర్లతో తాజాగా ఓ రహస్య భేటీని ఈ విషయమై చంద్రబాబు నిర్వహించారట.
‘జనసేనతో కలిసి పొత్తులకి వెళుతున్నాం.. పార్టీ అధికారంలోకి రావడం కోసం త్యాగాలకు సిద్ధమవ్వాల్సిందే..’ అని పార్టీ ముఖ్య నేతలకు చంద్రబాబు గతంలోనే ఓ క్లారిటీ ఇచ్చేసిన సంగతి తెలిసిందే. అయితే, ‘మేమే అధికారంలోకి వస్తాం..’ అని జనసేనాని పదే పదే చెబుతుండడంతో, చంద్రబాబు ఒకింత గుస్సా అవుతున్నారు.
జనసేన – టీడీపీ పొత్తు కుదిరినా, అధికారంలోకి వచ్చేది టీడీపీయేననీ, జనసేన పార్టీ ఆ ప్రభుత్వంలో కొన్ని మంత్రి పదవులు సాధించే అవకాశంమాత్రమే వుంటుందని అప్పటిదాకా టీడీపీ శ్రేణులు భావిస్తూ వచ్చాయి. ఎప్పుడైతే, ‘మేం అధికారంలోకి వస్తాం..’ అని పవన్ కళ్యాణ్ చెప్పారో, అప్పటినుంచి టీడీపీకే మంత్రి పదవులు బిచ్చేమేసే అవకాశం వుంటుందని టీడీపీ శ్రేణులు గుస్సా అవడం మొదలైంది.
సరే, కింది స్థాయిలో జరిగే రచ్చ అలాగే వుంటుంది. విడిపోయి పోటీ చేస్తే ఇరువురం నష్టపోతామన్న ప్రతిపాదన చంద్రబాబు నుంచి వస్తోంటే, ‘వైసీపీ వ్యతిరేక ఓటు చీలిపోకూడదు’ అనే భావన జనసేనాని కూడా వ్యక్తం చేస్తున్నారు.
ముందస్తు ఎన్నికల ప్రచారం నేపథ్యంలో, పొత్తులపై వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మీద ఒత్తిడి తెస్తున్నారట. నారా లోకేష్ యువగళం పాదయాత్ర ప్రారంభమవుతుంది గనుక, రెండు పార్టీలూ కలిస్తే.. ఫలితం బావుంటుందన్నది చంద్రబాబు యోచన అట.
కానీ, పొత్తుల వ్యవహారంపై అప్పుడే కాదు.. ఎన్నికలొచ్చినప్పుడు చూద్దామని పవన్ కళ్యాణ్ అంటున్నారట.మరి, ఈ పంచాయితీ ఎప్పుడు కొలిక్కి వస్తుందో ఏమో.!
