ముఖ్యవిషయాల్లో సీఎం చంద్రబాబు తీసుకున్న తాజా నిర్ణయాలు, వైసీపీకి రాజకీయంగా ఎదురుదెబ్బలుగా మారాయి. పాస్టర్లు, మత్స్యకారుల విషయంలో గత ప్రభుత్వం చేసిన విమర్శలకు సమాధానం చెప్పకపోయినా, ఇప్పుడు నేరుగా అమలులోకి దిగడం గమనార్హం. ముఖ్యంగా గత ఏడాది నుంచి పెండింగ్లో ఉన్న పాస్టర్ల గౌరవవేతనం విడుదల చేయడం, మత్స్యకారులకు భరోసా నిధిని ప్రకటించడం ద్వారా రాజకీయంగా వేగాన్ని పెంచారు.
వైసీపీ గత పదినెలలుగా ఈ రెండు అంశాలపై ప్రభుత్వాన్ని నిరంతరం టార్గెట్ చేస్తూ వచ్చింది. పాస్టర్లకు గౌరవవేతనం నిలిపేశారని, మత్స్యకారులకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని ఆరోపిస్తూ ప్రచారం సాగించింది. అయితే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చే దిశగా ఇప్పుడు చంద్రబాబు సర్కారు అడుగులు వేస్తోంది. మత్స్యకారుల కోసం ఒక్కొక్కరికి రూ.20,000 చొప్పున ఇచ్చేందుకు ఈ నెల 26న కార్యక్రమం ఏర్పాటు చేయగా, పాస్టర్లకు రూ.30 కోట్లు విడుదల చేశారు.
పరిపాలనలో తక్షణ నిర్ణయాలు తీసుకుని ప్రతిపక్ష విమర్శలకు తగిన రీతిలో జవాబివ్వాలనే వ్యూహం ఇది. మళ్లీ వైసీపీ ఈ అంశాలను లేవనెత్తే స్థితి లేకుండా, ముఖ్యమైన వర్గాలను సానుభూతిగా మలుచుకోవడమే లక్ష్యంగా చంద్రబాబు ప్లాన్ చేసుకున్నారు. ఇదే సమయంలో తన పాలనలో మతసామరస్యానికి ప్రాధాన్యం ఉన్నదనే సంకేతాన్ని కూడా పంపించారు.
ఇక మీదట వైసీపీ ఈ రెండు అంశాలపై మాట ఎత్తే అవకాశమే లేకుండా పోయింది. దాంతో ఇప్పుడు విమర్శలు చేసే కోణమే లేకుండా వైసీపీ నేతలు కంగారుపడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే, సీఎం చంద్రబాబు రెండు కీలక వర్గాలను ఒకేసారి టచ్ చేస్తూ, రాజకీయంగా ఒక క్లాస్ మోవ్ తీసుకున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.