బ్రేకింగ్: ఏపీ సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విపక్షాలు గట్టిగా పట్టుబడితేనో, తప్పని పరిస్థితుల్లోనే అధికార ప్రభుత్వాలు శ్వేత పత్రాలు బయట పెట్టడానికి సాహసించవు. అలాంటిది అడగకుండానే ఏపీ సీఎం చంద్రబాబు శ్వేతపత్రాలు తమ నాలుగున్నరేళ్ల పాలనపై శ్వేత పత్రాలు ఇస్తామంటున్నారు. ఏపీ అభివృద్ధిపై, సంక్షేమ కార్యక్రమాలపై ఏకంగా తొమ్మిది శ్వేత పత్రాలు విడుదల చేయటానికి సిద్ధం అంటున్నారు. విపక్షాల విమర్శలకు వీటితో సమాధానం చెప్పాలనుకుంటున్నారా? ఈ ప్రయత్నం టీడీపీకి ప్లస్ అవుతుందా? లేక డిఫెన్స్ లో పడేస్తుందా? దీనిపై పూర్తి సమాచారం కింద ఉంది చదవండి.

రాష్ట్రంలో నాలుగున్నరేళ్లలో జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రాలు విడుదలకు రెడీ అవుతున్నారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. రాష్ట్ర విభజన నాటికి ఏపీ పరిస్థితి ఏమిటి? ఇప్పుడు ఉన్న పరిస్థితులు ఏమిటి? అనే అంశాలపై శ్వేత పత్రాలు రెడీ చేస్తోంది టీడీపీ అధిష్టానం. ఉన్నట్లుండి చంద్రబాబు వైట్ పేపర్ ప్రస్తావన ఎందుకు తెచ్చారు? ఎన్నికలు దగ్గర పడుతున్న తరుణంలో శ్వేత పత్రాల విడుదల ప్రతిపక్షాలకు అస్త్రం ఇచ్చినట్టు కాదా? అన్నీ తెలిసి సై అంటున్నారంటే దీని వెనుక చంద్రబాబు వ్యూహం ఏమిటి?

ఎక్కడైనా శ్వేత పత్రాల విడుదలకు ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తుంటాయి. కానీ ఏపీ సీఎం చంద్రబాబు ఎవరూ అడగముందే శ్వేత పత్రాల విడుదలకు సిద్ధం అవుతున్నారు. రాష్ట్ర తాజా ముఖచిత్రంపై తొమ్మిది శ్వేత పత్రాలు విడుదల చేయాలనీ చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. నాలుగున్నరేళ్ల రాష్ట్ర పురోగతిపై వివరణాత్మక నివేదికలు ఇవ్వనున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో నాటి వాస్తవ పరిస్థితులపై అంశాలవారీగా శ్వేత పత్రాలు విడుదల చేసిన సీఎం, ఇప్పటి తాజా పరిస్థితులను నాటి పరిస్థితులతో పోలుస్తూ ఈ నెల చివరి వరం నుండి రోజుకో అంశంపై వైట్ పేపర్స్ విడుదల చేయనున్నారు.

విభజన సమస్యలు, రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి, విద్యా, వైద్యరంగాల పురోగతి, జలవనరుల అభివృద్ధి, ప్రాజెక్టుల పురోగతి, మానవ వనరుల పురోగతి, పరిశ్రమలు-ఉపాధి కల్పన, సేవారంగం అభివృద్ధి, వివిధ వర్గాల సంక్షేమం, మౌలిక వసతుల అభివృద్ధి తదితర అంశాలపై 9 శ్వేత పత్రాలు విడుదలకు సీఎం చంద్రబాబు సీఎం సిద్ధం అవుతున్నారు. నాలుగున్నరేళ్ల క్రితం అప్పటి స్థితిగతుల అంశాలపై శ్వేత పత్రాలు ఇచ్చారు చంద్రబాబు. తాజాగా జారీ చేసే 9 పత్రాల్లో 2014 శ్వేత పత్రాల నేపధ్యాన్ని వివరించబోతున్నారు.

రాష్ట్ర విభజన సమస్యలు, రాష్ట్రంపై ఉన్న సవాళ్ళను ప్రస్తావించనున్నారు. రాష్ట్ర పురోగతి, భవిష్యత్ కార్యాచరణను వీటికి జోడించనున్నారు. అంశాలవారీగా రోజుకొకటి చొప్పున శ్వేత పత్రాలను విడుదల చేయాలనుకుంటున్న సీఎం… వీటిని ప్రజల్లోకి తీసుకెళ్లే బాధ్యతను నాయకులకు అప్పగించనున్నారు. జనవరి నెలలో చేపట్టనున్న జన్మభూమి-మావూరు గ్రామా సభల్లో శ్వేత పత్రాలపై చర్చకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 2014 శ్వేత పత్రాల్లో ప్రధానంగా రాష్ట్ర సమస్యలు ప్రస్తావించారు. రాష్ట్ర విభజనతో ఎదురయ్యే సవాళ్ళను పొందుపరిచారు. ఇప్పుడు విడుదల చేయబోతున్న శ్వేత పత్రాల్లో నాలుగున్నరేళ్ల పురోగతిని వివరిస్తూనే…రాబోయే ఐదేళ్ళలో ఏమేం చేయబోతున్నారో ప్రస్తావించాలి అనుకుంటున్నారు ఏపీ సీఎం.

కాగా ప్రతిపక్ష వైసీపీ పార్టీ అధినేత జగన్ నవరత్నాల పథకంతో ప్రజల్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. అయితే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు వాటికి పోటీగా నవశ్వేత పత్రాలతో ప్రజలను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారా అని రాష్ట్రవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి.