‘‘తెలుగుదేశం పరిపాలన అద్భుతంగా ఉంది.. ఈ నెల ప్రభుత్వంపై 76 శాతం సంతృప్తి ఉంది. వచ్చే నెల్లో దీన్ని 80 శాతానికి తీసుకెళ్లాలి’’ ఇవీ చంద్రబాబు ప్రతిరోజూ చెప్పే మాటలు కాదు,కాదు, మాయమాటలు.
బాబుతో ఈ మాటలు చెప్పిస్తున్నది మరెవరో కాదు, ఆయనా ఒక బాబే. బాబు వెనకున్న ఈ ఎ.బాబుపై టీడీపీ నాయకులే కాదు సీనియర్ అధికారులు కూడా మండిపడుతున్నారు.
క్షేత్రస్థాయిలో సంతృప్తి శాతం ఎంత ఉందో తెలియదు కానీ గత మూడు నెలల్లో ఈ స్థాయిని 60 నుంచి 76 శాతానికి తీసుకొచ్చేశారు. ప్రజల్లో సంతృప్తి ఇలా అమాంతం పెరిగిపోవడానికి బాబు వెనక ఉన్న బాబే కారణం. ఆయన ఇచ్చే రిపోర్టులను చూసే చంద్రబాబు తన పరిపాలన సుపరిపాలన అని, గుప్తులకాలం నాటి స్వర్ణయుగంలా తన పాలన ఉందని ఫీలైపోతున్నారు. ప్రతిరోజూ ఆయన ఇచ్చే రిపోర్టులను చూసిన తర్వాత చంద్రబాబు తన పని మొదలు పెడుతున్నారు. కానీ చంద్రబాబు చుట్టూ ఉన్న సీనియర్ అధికారులు, పార్టీ నాయకులు మాత్రం ఈ రిపోర్టులన్నీ మాయని వాపోతున్నారు.

చంద్రబాబు వెనక ఉన్న బాబు
గతంలో కృష్ణాజిల్లా కలెక్టర్గా పనిచేసిన అహ్మద్ బాబును చంద్రబాబు ఏరికోరి తన డ్రీమ్ ప్రాజెక్ట్ రియల్ టైమ్ గవర్నెన్స్ (ఆర్టీజీ) కు తీసుకొచ్చారు. ప్రభుత్వ పథకాలు, నిర్ణయాలు వంటి అన్ని విషయాలపైనా ఆర్టీజీ సర్వే చేసి ఎప్పటికప్పుడు సీఎంకు అందిస్తుంది. ఇందుకోసం రోజుకు 15 లక్షల ఫోన్ కాల్స్ ఆర్టీజీ ద్వారా ప్రజలకు వెళతాయి. వాళ్లిచ్చే సమాధానాలన్నింటినీ క్రోడీకరించి రిపోర్టు తయరుచేసి చంద్రబాబు వద్ద పెడుతున్నారు. ఆయన వీటినే నమ్మి ముందుకు అడుగులు వేస్తున్నారు. కానీ ఈ కాల్స్, సర్వే తీరు, ఉన్నది లేనట్లు చూపే అహ్మద్బాబు వ్యవహార శైలిపై టీడీపీ సీనియర్లు మండిపడుతున్నారు. సీనియర్ ఐఏఎస్ అధికారులు సైతం ఇదేంటి సీఎంను ఎందుకిలా డైవర్ట్ చేస్తున్నావని ఎ.బాబును ప్రశ్నించినా ఆయన వారికీ ఏవో కట్టు కథలు చెప్పి తన రూటులో స్పీడుగా వెళ్లిపోతున్నాడు.
టెక్నాలజీ పేరుతో చంద్రబాబుకు దగ్గరైన ఎ.బాబు ఆయనకు ఇప్పుడు నోట్లో నాలుకలా మారారు. పిడుగు ఎక్కడ పడిందో అరగంట ముందే చెప్పేస్తాం, మారుమూల ఏ ఊళ్లో రోడ్డు గుంతలు పడ్డాయో నా ట్యాబ్ నుంచే చూస్తున్నా, ఏ ఊళ్లో ఎక్కడ వీధి లైటు వెలగలేదో నాకు తెలిసిపోతుందంటూ చంద్రబాబు చెప్పే మాటల మర్మం వెనుక ఉన్నది ఎ.బాబుగారే. ఎ.బాబు చెప్పేవన్నీ నమ్మొద్దని, ఇలాంటివి నమ్మే గతంలో అధికారానికి దూరమయ్యామని పార్టీ సీనియర్లు చంద్రబాబును హెచ్చరిస్తున్నా ఆయన వినడంలేదు. సీనియర్ అధికారులు కూడా ఎ.బాబు తీరుపై చంద్రబాబుకు ఫిర్యాదులు చేస్తున్నా ఆయన తాను టెక్నో సావీనని చూపించుకునే తాపత్రయంలో అతడిని వదలడంలేదు.
రెండేళ్లుగా బాబును నడిపిస్తున్న ఈ ఎ.బాబు గురించి సీఎంఓలో ఉన్న టాక్ ఏమిటో తెలుసా. వచ్చే ఎన్నికల్లో టీడీపీ ఓడిపోతే దానికి ప్రధాన కారకుడు ఎ.బాబే అవుతాడట. చంద్రబాబు వీర విధేయ అధికారులైతే టీడీపీని ఓడించేందుకు ఎ.బాబు కోవర్టుగా వచ్చి ఇలా చేస్తున్నాడనే వ్యాఖ్యలు చేస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం అవేమీ పట్టించుకోకుండా ఎ.బాబు టెక్నాలజీ మాయలో పడి ప్రతిరోజూ తనపై ప్రజల్లో ఎంత సంతృప్తి పెరిగిందో చూసుకుంటున్నారు.
(పిబి కుమార్)
