సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ మృతి

ప్రముఖ సినీ నటుడు వైజాగ్ ప్రసాద్ ఈ రోజు తెల్లవారు జామున 3 గంటలకు గుండెపోటుతో కన్నుమూసారు.ఆయన వయసు 75 సంవత్సరాలు.అనేక తెలుగు సినిమా మరియు టీవీ సీరియల్స్ లో ఆయన నటించారు..గత రెండేళ్లుగా అనారోగ్య సమస్యలు వల్ల ఇంటికే పరిమితం అయ్యారు.

వైజాగ్ ప్రసాద్ అసలు పేరు కొర్లాం పార్వతీ ప్రసాదరావు. విశాఖపట్నం సమీపంలోని గొపాలపట్నం సొంతవూరు. వైజాగ్ నుంచి రావడంతో ఆయనకు వైజాగ్ ప్రసాద్ అనే పేరు స్థిరపడింది. నాటక రంగంనుంచి సీనిరంగానికి వచ్చిన ప్రసాద్ నాటకాలలో హీరో, విలన్ పాత్రలు వేస్తూ వచ్చారు. ఆయన హీరో గా వేసిన నాటకం ‘నేనూ మనిషినే’కి మంచిపేరొచ్చింది. అక్కడి నుంచి నాటకాలలో ఆయన బాగాఅవకాశాలొచ్చాయి. ‘బాబాయ్ అబ్బాయ్’  ఆయన మొదటి సినిమా. తర్వాత మొగుడుపెళ్లాలు, ప్రతిఘటన చిత్రాలలో నటించారు. కె విశ్వనాథ్ గారు ఆయన కు శ్రుతిలయలు లోనటించే అవకాశమించ్చారు. ఇది చాాలా చిత్రంగా జరిగింది. కాలధర్మం అనే నాటికలో ఆయన నటించినపుడు ప్రేక్షకుల్లో కె విశ్వనాధ్ ఉన్నారు. ప్రదర్శన అయిపోయాక ప్రసాద్ వెళ్లి విశ్వనాథ్ కు నమస్కారం చేశారు. అయితే, విశ్వనాథ్ స్పందన  ‘అయ్యో మీరు పెద్దవారు, మీరు నాకు నమస్కారం పెట్టడం ఏమిటి? ’అన్నారు. ఆ నాటికలో ఆయన వృద్ధుడి పాత్ర వేశారు. తర్వాత కాలకూటం అనే నాటకం చూసి ఉప్పలపాటి నారాయణరావు మొసగాడు చిత్రంలో, నిర్మానుష్యం నాటకం చూసి గొల్లపూడి ‘ప్రేమపుస్తకం’లో నటించేందుకు అవకాశమిచ్చారు.

ఆయన  సీనీ జీవితం కొత్త మలుపు తిరిగింది 2000 సం.లో.  పరచూరి బ్రదర్స్ నాటకోత్సవాలలో ఆయన కలల రాజ్యం అనే నాటకంలో నటించారు. ఆయన నటనకు ఉత్తమ సహాయ నటుడి అవార్డు లభించింది. అయితే అంతకంటే ముఖ్య మయిన విషయం ఏంటంటే, ఆ ప్రదర్శనని దర్శకుడు తేజ కూడా చూశారు. ఫోన్ చేసి ప్రశంసించారు. తన తీయబోతున్న సినిమాలో ఒక అవకాశం ఉంది, వేస్తార అని కూడా అడిగారు. దానికి ప్రసాద్ సరే అన్నారు. కొద్ది రోజుల తర్వాత తేజ ఫోన్ చేసి, ఉన్నఫలాన హైదరాబాద్ రమ్మన్నారు.‘నువ్వునేను’ సినిమా నటంచాలన్నారు. టెస్ట్ చేశారు. ఒకె అయింది.  ఆయన ఫోటో మొదటిసారి వాల్ పోస్టర్లకెక్కింది. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. దానితో ప్రసాద్ అవకాశాలు ముమ్మరమయ్యాయి. ఆయన తన ప్రభుత్వోొద్యోగానికి రాజీనామా చేసి సినిమా నటుడిగా సెటిల్ అయ్యారు.

మొత్తం ఆయన 170 పైగా సినిమాలలో నటించారు.