Tripuraneni Chittibabu Passes Away: తెలుగు చలనచిత్ర పరిశ్రమలో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నిర్మాత, దర్శకుడు, నటుడు మరియు రాజకీయ విశ్లేషకులు త్రిపురనేని చిట్టిబాబు (71) మంగళవారం అర్ధరాత్రి కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, గుండెపోటు రావడంతో హైదరాబాద్లోని ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఆయన మృతితో టాలీవుడ్ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు.
కృష్ణా జిల్లా కాజా గ్రామంలో జన్మించిన చిట్టిబాబు అసలు పేరు వరప్రసాద్. ఆయన తండ్రి ప్రముఖ రచయిత, నిర్మాత అయిన త్రిపురనేని మహారథి. తండ్రి వారసత్వంతోనే సినీ రంగ ప్రవేశం చేసిన చిట్టిబాబు, తొలినాళ్లలో దిగ్గజ రచయితలు ఆత్రేయ, అప్పలాచార్య వద్ద సహాయకుడిగా పనిచేసి సినిమా మెళకువలు నేర్చుకున్నారు.
చిట్టిబాబు తన సుదీర్ఘ కెరీర్లో దర్శకుడిగా, నటుడిగా, నిర్మాతగా తనదైన ముద్ర వేశారు.

‘సంతానం’ సినిమాతో మెగాఫోన్ పట్టిన ఆయన, మొత్తం 12 చిత్రాలకు దర్శకత్వం వహించారు. సుమారు 30కి పైగా చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా, హాస్యనటుడిగా ప్రేక్షకులను అలరించారు. దాదాపు 49 సినిమాలకు కో-డైరెక్టర్గా వ్యవహరించి పరిశ్రమలో సీనియర్ టెక్నీషియన్గా పేరు తెచ్చుకున్నారు.
సౌందర్యను పరిచయం చేసిన ఘనత చిట్టిబాబే తెలుగు తెరపై అగ్ర నటిగా వెలిగిన సౌందర్యను టాలీవుడ్కు పరిచయం చేసింది చిట్టిబాబే కావడం విశేషం. కేవలం సినీ రంగమే కాకుండా, రాజకీయ విశ్లేషకుడిగా కూడా ఆయన టీవీ చర్చా కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారు. నిర్మొహమాటంగా తన అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించేవారు.
చిట్టిబాబు మృతి పట్ల తెలుగు ఫిల్మ్ ఛాంబర్, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (MAA) సభ్యులు మరియు పలువురు రాజకీయ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

