స్టార్ హీరో బాలకృష్ణ స్వయంగా నటిస్తూ నిర్మిస్తున్న చిత్రం యన్.టి.ఆర్. రెండు భాగాలుగా విడుదల అవుతున్న ఈ సినిమా గురించిన విశేషాలు రోజుకొకటి అభిమానులను అలరిస్తున్నాయి. తాజాగా ఎన్టీఆర్తో సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన శ్రీదేవి పాత్రకు యంగ్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ను ఫైనల్ చేశారు. ఈ విషయాన్ని రకుల్ అధికారికంగా ధృవీకరించింది. అదీ తెలిసిన వార్తే. అదే సమయంలో మరో వార్త వెబ్ ప్రపంచంలో హల్ చల్ చేస్తోంది.
అదేమిటంటే…అప్పట్లో వేటగాడు సినిమాలో సూపర్ హిట్టైన ఆకు చాటు పిందె తడిసే పాటను..రకుల్, బాలయ్యపై చిత్రీకరించనున్నారని. అదే కనుక నిజమే అయితే ..ఆ టైమ్ లో థియోటర్ ఊగిపోవటం ఖాయం అంటున్నారు విశ్లేషకులు. క్రిష్ చాలా తెలివిగా కమర్షియల్ ఎలిమెంట్స్ ని సినిమాలో ఒక్కోటి కూర్చుకుంటూ వస్తున్నారని అభిమానులు సంబరపడుతున్నారు.
యన్.టి.ఆర్ సినిమాలో నటించటంపై స్పందించిన రకుల్.. ‘ప్రస్తుతం అందరి కళ్లు నామీదే ఉన్నాయి. అందుకే శ్రీదేవి పాత్రలో నటించేందుకు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాను. నేను కూడా ఆమె అభిమానినే. ఆమె పాత్రను వెండితెర మీద చూపించటం చాలా పెద్ద సాహసం. ఈ ప్రయత్నంలో విజయం సాధిస్తానన్న నమ్మకం ఉంది’అన్నారు.
ఇక ఈ చిత్రం తొలి భాగం ‘యన్.టి.ఆర్ కథానాయకుడు’లో నందమూరి తారక రామారావు సినీ జీవిత విశేషాలను చూపించనున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాలో ఏఎన్నార్గా సుమంత్, చంద్రబాబు నాయుడిగా రానా, సావిత్రి పాత్రలో నిత్యామీనన్ కనిపిస్తున్నారు.