ప్రముఖ దర్శకురాలు గుండెపోటుతో కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. టాలీవుడ్ దర్శకురాలు బీ.జయ గుండెపోటుతో కన్నుమూశారు. గురువారం రాత్రి 11 గంటల సమయంలో ఆమెకు గుండెపోటు రాగా కుటుంబ సభ్యులు  ఆసుపత్రికి తీసుకెళ్లేలోపు ఆమె మరణించింది. ఆమెకు ప్రస్తుతం 54 ఏళ్లు. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలో జయ నివాసముంటున్నారు. పంజాగుట్ట స్మశాన వాటికలో శుక్రవారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు.

2003లో చంటిగాడు సినిమాకు ఆమె దర్శకత్వం వహించారు. దాని తర్వాత ప్రేమికులు, గుండమ్మగారి మనవడు, సవాల్, లవ్లీ, వైశాఖం లాంటి చిత్రాలకు జయ దర్శకత్వం వహించారు. జయ జర్నలిస్టుగా తన కెరీర్ ను ప్రారంభించారు. ప్రస్తుతం సినీ వార పత్రికను జయ నడిపిస్తున్నారు. దర్శకురాలు, జర్నలిస్టుగానే కాకుండా తాను దర్శకత్వం వహించిన సినిమాలకు తానే ఎడిట్ చేసుకునేవారు.

జయ  ప్రముఖ జర్నలిస్ట్. పీఆర్ వో బీఏ రాజు భార్య. ఆమె తన భర్తతో కలిసి పలు చిత్రాలను కూడా నిర్మించారు. సీనీ ఇండస్ట్రీలో ప్రతిభ ఉన్న దర్శకురాలిగా జయ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. జయ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు, నాయకులు, జర్నలిస్టులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.