ప్ర‌భాస్‌తో దిల్ రాజు పాన్ ఇండియా స్కెచ్?

ప్ర‌భాస్ తో దిల్ రాజు సాన్నిహిత్యం గురించి తెలిసిందే. అత‌డితో మున్నా – మిస్ట‌ర్ పెర్ఫెక్ట్ లాంటి చిత్రాల్ని రాజుగా నిర్మించారు. ఆ త‌ర్వాత కూడా ప్ర‌భాస్ తో భారీ చిత్రాల్ని నిర్మించాల‌ని ప్లాన్ చేసినా ఈలోగానే యువిక్రియేషన్స్ సంస్థను లైన్ లోకి తెచ్చి ప్ర‌భాస్ చెక్ పెట్టేశాడు. అయితే బాహుబ‌లి లాంటి భారీ పాన్ ఇండియా చిత్రంలో న‌టించిన ప్ర‌భాస్ తో ఎలాగైనా ఓ పాన్ ఇండియా సినిమా తీయాల‌న్న‌ది రాజుగారి కోరిక‌.

అందుకోసం చాలా కాలంగా ట్రై చేస్తూనే ఉన్నాడు. అయితే ఇటీవ‌ల ప్ర‌భాస్ వ‌రుస‌గా యువి క్రియేష‌న్స్ లో మాత్ర‌మే సినిమాలు చేస్తున్నాడు. సాహో లాంటి భారీ పాన్ ఇండియా సినిమాని యువి బ్యాన‌ర్ లోనే చేయ‌డ‌మే గాక ఆ వెంట‌నే ప్ర‌భాస్ 20 జాన్ ని కూడా అదే బ్యాన‌ర్ లో స్టార్ట్ చేయ‌డంతో దిల్ రాజు ప‌ప్పులు ఉడ‌క‌లేదు. అయితే ప్ర‌భాస్ 21 అయినా త‌న శ్రీ వెంక‌టేశ్వ‌ర బ్యాన‌ర్ లో చేయాల‌న్నది దిల్ రాజు ప్లాన్. కానీ మ‌ధ్య‌లో అశ్వ‌నిద‌త్ అడ్డుకున్నారు. ఆయ‌న వైజ‌యంతి బ్యాన‌ర్ లో ప్ర‌భాస్ – నాగ్ అశ్విన్ కాంబినేష‌న్ లో భారీ పాన్ ఇండియా చిత్రం తీస్తున్నారు. అదిరిపోయే సోషియో ఫాంట‌సీ క‌థాంశాన్ని ఎంచుకుని విజువ‌ల్ గ్రాఫిక్స్ బేస్డ్ లో బ‌హుభాషా చిత్రాన్ని ద‌త్ నిర్మించనున్నారు.

జాన్ పూర్త‌వ్వ‌గానే ద‌త్ తో సినిమా సెట్స్ కెళుతుంది. అటుపై దిల్ రాజు కి అవ‌కాశం ఉంటుంద‌ని తెలుస్తోంది. అయితే అప్ప‌టికి అదిరిపోయే పాన్ ఇండియా స్క్రిప్టుని ప్ర‌భాస్ కోసం రెడీ చేయాల్సిందిగా త‌న ఆస్థాన ద‌ర్శ‌కుడు వేణు శ్రీ‌రామ్ కి రాజుగారు సూచించార‌ట‌. ఏదైనా స్క్రిప్టు డిసైడ్ చేస్తుంది. అప్ప‌టికి డార్లింగ్ మూడ్ ఎలా ఉంటుందో కూడా చూడాలి.