గండిపేట చెరువులో పడ్డ నటుడు చంద్ర మోహన్ – ఫ్లాష్ బ్యాక్

తెలుగు సినిమా రంగంలో చంద్ర మోహన్  ఓ విలక్షణమైన నటుడు. ఎన్నో చిరస్మరణీయమైన సినిమాల్లో నటించాడు . గ్లామర్ సినిమా లోకంలో సహజమైన నటుడు . ఎప్పుడు ఒకేరకంగా ఉండటం అతనికే సాధ్యం . విజయాలు వున్నా , అపజయాలు వెన్నాడుతున్నా దేనికీ వెరవని నటుడు చంద్ర మోహన్ . ఆయనతో నటించిన హీరోయిన్లు అందరు తార పథంలో దూసుకెళ్లినవారే . అందుకే “నా పక్కన నటించాలంటే అదృష్టం ఉండాలి , నేను గేట్ వే అఫ్ హీరోయిన్స్ ” అని కొత్తగా సినిమా రంగానికి వచ్చిన వారిని ఊరిస్తూ ఉంటాడు చంద్ర మోహన్ .

ఆయన్నీ సినిమా రంగంలో ముద్దుగా సి ఎమ్ ( చంద్ర మోహన్ ) అని పిలుస్తారు . చంద్ర మోహన్ కు సంబందించిన ఓ సంఘటన. 1982 ఏప్రిల్ మొదటి వారం . హైదరాబాద్ కు  సమీపాన వున్న గండిపేట . ఆరోజున సి ఎస్ రావు దర్శకత్వంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.

చంద్ర మోహన్ ,రాజ్య లక్ష్మి . శంకరా  భరణం తరువాత ఈ జంటకు బాగా పాపులారిటీ వచ్చింది. మధ్యాహ్నం అవడంతో లాంచ్ బ్రేక్ చెప్పా.  అందరు భోజనానికి సమీపాన వున్నా గెస్ట్ హౌస్ కు వెడుతున్నారు.

 సి ఎస్ రావు గారు తన కారులో నన్ను రమ్మన్నారు . అయితే మేమిద్దరం కలసి వస్తాం అని దర్శకుడుతో చెప్పారు. “సరే రండి “అన్నాను .

“మీరు నాతో రండి , ఓ సంఘటన చెబుతాను “అన్నాడు

సంఘటన అనగానే నాకు కూడా ఆసక్తి కలిగింది . చంద్ర మోహన్ గండిపేట  నీళ్ల వైపు నడవసాగాడు .

 చంద్ర మోహన్ ను అనుసరించసాగాను . నీళ్ల దగ్గరకు వచ్చి చేతితో నీళ్లు తీసుకొని త్రాగాడు .

కాసేపు నీళ్ల వైపు తిరిగి ప్రార్ధించాడు .

చంద్ర మోహన్ ఎందుకు అలాచేస్తున్నాడో నాకు అర్ధం కాలేదు .

నీళ్ళల్లో కాస్త దూరం వెళ్లి “ఆమ్మో “అని బయటికి వచ్చాడు .

“ఈ నీళ్లు త్రాగే అదృష్టం వుంది “అన్నాడు .

“అవునవును గండిపేట నీళ్లు చాలా బాగుంటాయి “అన్నాను

మీకో సంఘటన చెబుతాను ,అన్నా కదా “

“అవును , చెప్పండి “

“1957 నాటి ఘటన  అనగనగా  ఓ అబ్బాయి . అతను ఎస్ ఎస్ ఎల్ సి  చదువుతున్నాడు . చూడటానికి బాగానే ఉంటాడు.

అప్పుడు అతను ఆంధ్రాలో ఉండేవాడు . ఒకసారి స్కూల్ పిల్లలతో కలసి విహార యాత్ర కోసం  హైదరాబాద్ వచ్చాడు . హైద్రాబాద్లో వున్న అన్నీ చూసిన  తరువాత గండిపేట చూడటానికి తన సహాధ్యాయులు , గురువులతో కలసి వచ్చాడు .

చక్కటి వాతావరణం , ఆహ్లాదం కలిగించే పరిసర ప్రాంతాలు .  అదుగో ఆ కనిపిస్తున్న చెట్ల క్రిందకు చేరి అందరు మధ్యాన్నం భోజనం చేయసాగారు . భోజనం మధ్యలో ఈ అబ్బాయికి మంచి నీళ్లు అయ్యాయి . చుట్టూ చూశాడు . ఎవరి దగ్గరా మంచి నీరు కనిపించలేదు . ఎదురుగా గండిపేట నీరు కనిపించింది . అంతే ఇంకేం ఆలోచించకుండా అటువైపు వెళ్ళాడు .

నీళ్ల దగ్గర ఓ రాతి బండ కనిపించింది , ఆ బండ మీద కూర్చొని  దోసిళ్ళతో నీరు త్రాగసాగాడు . గండిపేట నీరు ఎంత బాగున్నాయి  అనుకుంటూ  నిండుగా వున్న నీటిని చూడసాగాడు తన్మయంగా . అంతే  ఏమి జరిగిందో తెలియదు.

 కాలు జారింది దబ్బున నీళ్ళల్లో పడ్డాడు “

“అయ్యో … మరి “

“ఆగండి , మరో ముగ్గురు విద్యార్థులు నీళ్లు తాగుదాం అని వచ్చి  ఆ అబ్బాయి నీళ్ళల్లో పడటం చూసి రక్షించడానికి  ప్రయత్నించి వారు కూడా నీటిలో పడ్డారు .

ఆ నలుగురు కుర్రవాళ్ళు రక్షించండి  రక్షించండి … అంటూ ఒకటే కేకలు .

వీరి కేకలు విని భోజనం చేస్తున్న గురువులు పరిగెత్తుకుంటూ వచ్చి నలుగురినీ నీళ్లలో పైకి లాగి కాపాడారు .

నేను నుంచున్నానే సరిగ్గా ఇక్కడే ఆ ఘటన జరిగింది “

“ఇంతకీ  ఆఘటన ..”

“దానికీ నీకు ఏమిటీ సంబంధం అనేగా … వస్తున్నా.. ముందుగా నీళ్లు తాగుదామని వచ్చి నీళ్లలో పడింది నేనే .

ఆ రోజున బ్రతికాను కాబట్టే ఆర్టిస్టు అయ్యాను పేరు సంపాదించాను . ఇదిగో మళ్ళీ ఈ గండిపేట  నీళ్లు  ఇన్ని సంవత్సరాల తరువాత త్రాగాను .

ఏదైనా వ్రాసి పెట్టి ఉంటుందని పెద్దవారు ఊరికే అనలేదు . ఈ భూమీద బ్రతికి వుండాలని ఆ బ్రహ్మయ్య  వ్రాసి పెట్టాడు . అందుకే బ్రతికాను .

ఈరోజు ఇక్కడ షూటింగ్ చేస్తుంటే ఈ సంఘటన జరిగింది ” అంటూ ముగించాడు చంద్ర మోహన్ .

-భగీరథ