తెలుగు సినిమా రంగంలో చంద్ర మోహన్ ఓ విలక్షణమైన నటుడు. ఎన్నో చిరస్మరణీయమైన సినిమాల్లో నటించాడు . గ్లామర్ సినిమా లోకంలో సహజమైన నటుడు . ఎప్పుడు ఒకేరకంగా ఉండటం అతనికే సాధ్యం . విజయాలు వున్నా , అపజయాలు వెన్నాడుతున్నా దేనికీ వెరవని నటుడు చంద్ర మోహన్ . ఆయనతో నటించిన హీరోయిన్లు అందరు తార పథంలో దూసుకెళ్లినవారే . అందుకే “నా పక్కన నటించాలంటే అదృష్టం ఉండాలి , నేను గేట్ వే అఫ్ హీరోయిన్స్ ” అని కొత్తగా సినిమా రంగానికి వచ్చిన వారిని ఊరిస్తూ ఉంటాడు చంద్ర మోహన్ .
ఆయన్నీ సినిమా రంగంలో ముద్దుగా సి ఎమ్ ( చంద్ర మోహన్ ) అని పిలుస్తారు . చంద్ర మోహన్ కు సంబందించిన ఓ సంఘటన. 1982 ఏప్రిల్ మొదటి వారం . హైదరాబాద్ కు సమీపాన వున్న గండిపేట . ఆరోజున సి ఎస్ రావు దర్శకత్వంలో ఓ పాటను చిత్రీకరిస్తున్నారు.
చంద్ర మోహన్ ,రాజ్య లక్ష్మి . శంకరా భరణం తరువాత ఈ జంటకు బాగా పాపులారిటీ వచ్చింది. మధ్యాహ్నం అవడంతో లాంచ్ బ్రేక్ చెప్పా. అందరు భోజనానికి సమీపాన వున్నా గెస్ట్ హౌస్ కు వెడుతున్నారు.
సి ఎస్ రావు గారు తన కారులో నన్ను రమ్మన్నారు . అయితే మేమిద్దరం కలసి వస్తాం అని దర్శకుడుతో చెప్పారు. “సరే రండి “అన్నాను .
“మీరు నాతో రండి , ఓ సంఘటన చెబుతాను “అన్నాడు
సంఘటన అనగానే నాకు కూడా ఆసక్తి కలిగింది . చంద్ర మోహన్ గండిపేట నీళ్ల వైపు నడవసాగాడు .
చంద్ర మోహన్ ను అనుసరించసాగాను . నీళ్ల దగ్గరకు వచ్చి చేతితో నీళ్లు తీసుకొని త్రాగాడు .
కాసేపు నీళ్ల వైపు తిరిగి ప్రార్ధించాడు .
చంద్ర మోహన్ ఎందుకు అలాచేస్తున్నాడో నాకు అర్ధం కాలేదు .
నీళ్ళల్లో కాస్త దూరం వెళ్లి “ఆమ్మో “అని బయటికి వచ్చాడు .
“ఈ నీళ్లు త్రాగే అదృష్టం వుంది “అన్నాడు .
“అవునవును గండిపేట నీళ్లు చాలా బాగుంటాయి “అన్నాను
మీకో సంఘటన చెబుతాను ,అన్నా కదా “
“అవును , చెప్పండి “
“1957 నాటి ఘటన అనగనగా ఓ అబ్బాయి . అతను ఎస్ ఎస్ ఎల్ సి చదువుతున్నాడు . చూడటానికి బాగానే ఉంటాడు.
అప్పుడు అతను ఆంధ్రాలో ఉండేవాడు . ఒకసారి స్కూల్ పిల్లలతో కలసి విహార యాత్ర కోసం హైదరాబాద్ వచ్చాడు . హైద్రాబాద్లో వున్న అన్నీ చూసిన తరువాత గండిపేట చూడటానికి తన సహాధ్యాయులు , గురువులతో కలసి వచ్చాడు .
చక్కటి వాతావరణం , ఆహ్లాదం కలిగించే పరిసర ప్రాంతాలు . అదుగో ఆ కనిపిస్తున్న చెట్ల క్రిందకు చేరి అందరు మధ్యాన్నం భోజనం చేయసాగారు . భోజనం మధ్యలో ఈ అబ్బాయికి మంచి నీళ్లు అయ్యాయి . చుట్టూ చూశాడు . ఎవరి దగ్గరా మంచి నీరు కనిపించలేదు . ఎదురుగా గండిపేట నీరు కనిపించింది . అంతే ఇంకేం ఆలోచించకుండా అటువైపు వెళ్ళాడు .
నీళ్ల దగ్గర ఓ రాతి బండ కనిపించింది , ఆ బండ మీద కూర్చొని దోసిళ్ళతో నీరు త్రాగసాగాడు . గండిపేట నీరు ఎంత బాగున్నాయి అనుకుంటూ నిండుగా వున్న నీటిని చూడసాగాడు తన్మయంగా . అంతే ఏమి జరిగిందో తెలియదు.
కాలు జారింది దబ్బున నీళ్ళల్లో పడ్డాడు “
“అయ్యో … మరి “
“ఆగండి , మరో ముగ్గురు విద్యార్థులు నీళ్లు తాగుదాం అని వచ్చి ఆ అబ్బాయి నీళ్ళల్లో పడటం చూసి రక్షించడానికి ప్రయత్నించి వారు కూడా నీటిలో పడ్డారు .
ఆ నలుగురు కుర్రవాళ్ళు రక్షించండి రక్షించండి … అంటూ ఒకటే కేకలు .
వీరి కేకలు విని భోజనం చేస్తున్న గురువులు పరిగెత్తుకుంటూ వచ్చి నలుగురినీ నీళ్లలో పైకి లాగి కాపాడారు .
నేను నుంచున్నానే సరిగ్గా ఇక్కడే ఆ ఘటన జరిగింది “
“ఇంతకీ ఆఘటన ..”
“దానికీ నీకు ఏమిటీ సంబంధం అనేగా … వస్తున్నా.. ముందుగా నీళ్లు తాగుదామని వచ్చి నీళ్లలో పడింది నేనే .
ఆ రోజున బ్రతికాను కాబట్టే ఆర్టిస్టు అయ్యాను పేరు సంపాదించాను . ఇదిగో మళ్ళీ ఈ గండిపేట నీళ్లు ఇన్ని సంవత్సరాల తరువాత త్రాగాను .
ఏదైనా వ్రాసి పెట్టి ఉంటుందని పెద్దవారు ఊరికే అనలేదు . ఈ భూమీద బ్రతికి వుండాలని ఆ బ్రహ్మయ్య వ్రాసి పెట్టాడు . అందుకే బ్రతికాను .
ఈరోజు ఇక్కడ షూటింగ్ చేస్తుంటే ఈ సంఘటన జరిగింది ” అంటూ ముగించాడు చంద్ర మోహన్ .
-భగీరథ
