తెలంగాణ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి పై కొడంగల్ టిఆర్ ఎస్ అభ్యర్ధి పట్నం నరేందర్ రెడ్డి విమర్శలు గుప్పించారు. వచ్చే ఎన్నికల్లో రేవంత్ రెడ్డిని ప్రజలు తిరస్కరిస్తారని, రేవంత్ రెడ్డికి ఓటమి ఖాయమని హెచ్చరించారు. రేవంత్ రెడ్డిని ఓడించేందుకు వంద కోట్ల ఒప్పందం జరిగిందని చేస్తున్న ప్రచారం హాస్యాస్పదమన్నారు.
రేవంత్ కోసం వంద కోట్ల ఒప్పందం చేసుకునే సీన్ రేవంత్ కు లేదన్నారు. ఇవన్నీ గాలి మాటలని కొట్టిపారేశారు. కేసీఆర్, కేటిఆర్ లపైన కాదని దమ్ము, ధైర్యం ఉంటే తన పై రేవంత్ గెలవాలని సవాల్ విసిరారు. రేవంత్ నోరు అదుపులో పెట్టుకోవాలని పిచ్చి పిచ్చిగా మాట్లాడితే బాగుండదని హెచ్చరించారు.

టిఆర్ ఎస్ సంక్షేమ పథకాలే గెలుపు తీరాలకు చేరుస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. దీపావళి నాటికి ప్రతి ఇంటికి మిషన్ భగీరథ నీళ్లు అందుతాయని చెప్పారు. రాబోయే రెండేళ్లలో పాలమూరు రంగారెడ్డి ద్వారా కొడంగల్ నియోజకవర్గానికి సాగునీరు అందిస్తామన్నారు. కొడంగల్ లో మిషన్ భగీరథ పూర్తి కాకపోవటానికి రేవంత్ తీరే కారణమని దుయ్యబట్టారు.
నోరుంది కదా అని ఇష్టమొచ్చినట్టు మొరగడం కాదని చేతల్లో చూపించాలన్నారు. కొడంగల్ లో గులాబీ జెండా రెపరెపలాడుతుందన్నారు. రేవంత్ ఓటమి ఖాయమన్నారు.
