మోహన్ బాబు ట్వీట్ ..బాగా గుచ్చుకుంటోంది

ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా చెప్పే వ్యక్తిగా మోహన్ బాబుకు పేరుంది. అందుకే ఆయన కామెంట్స్ కు వ్యాల్యూ ఉంది. ఈ మధ్యన ఆయన సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటున్నారు. రీసెంట్ గా ఫసక్ తో పాపులర్ అయిన మోహన్ బాబు ఏం మాట్లాడినా అది చర్చగా మారుతోంది.

తాజాగా తెలంగాణలో టీఆరెస్ పార్టీ విజయం సాధించడంపై సీనియర్‌ సినీనటుడు మంచు మోహన్ బాబు స్పందించారు. కేసీఆర్‌ గెలవాలని దేవుళ్లను ప్రార్థించానని మోహన్‌బాబు అన్నారు. తెలంగాణ శాసనసభ ఎన్నికల్లో కేసీఆర్‌ భారీ మెజార్టీతో గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఆయనకు శుభాకాంక్షలు చెబుతూ మోహన్‌బాబు ట్వీట్‌ చేశారు.

‘ఎన్నికలకు ముందు ఫిలింనగర్ దైవ సన్నిధానం ప్రాంగణంలో కేసీఆర్ మళ్లీ గెలవాలని కోరుకున్నాను. దేవతలు తథాస్తు అన్నారు. ప్రజలు అద్భుతమైన, అనితర సాధ్యమైన విజయాన్ని అందించారు. కేసీఆర్ ఇది మీకే సంభవం.. మీ విజయ పరంపర ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ..’ అని ఆయన పోస్ట్‌ చేశారు.

ఈ ట్వీట్ పై సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. తెలుగుదేశం తరఫున రాజ్యసభ సభ్యుడిగా వెలిగిన మోహన్ బాబు..ఆ పార్టీ పెట్టన మహా కూటమికు వ్యతిరేకంగా గెలిచిన టీఆర్ ఎస్ కు అనుకూలంగా మాట్లాడటం హాట్ టాపిక్ గా మారింది. అదే విషయం గుర్తు చేస్తూ కామెంట్స్ చేస్తున్నారు. ఆ ట్వీట్ ..తెలుగుదేశం వారికి గుచ్చుకునేలా ఉందంటున్నారు.