Kaleshwaram Project: కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై షాక్ రిపోర్టు: బ్యారేజీలు అప్రయోజకమేనా?

తెలంగాణలో ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కాళేశ్వరం ప్రాజెక్ట్ ఇప్పుడు తీవ్ర విమర్శలపాలవుతోంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ (NDSA) నివేదిక తీవ్ర ఆందోళనకు దారితీస్తోంది. ఈ మూడు బ్యారేజీలను ఇకపై వాడడం ప్రమాదమేనని, అవి ఎప్పుడైనా కూలిపోయే ప్రమాదముందని స్పష్టం చేసింది.

NDSA గత 14 నెలలుగా చేసిన అధ్యయనంలో షాకింగ్ విషయాలు బయటపడ్డాయి. బ్యారేజీల డిజైన్, నిర్మాణ విధానం లోపభూయిష్టంగా ఉన్నాయని, భూసార పరీక్షలు సరిగా చేయకుండానే నిర్మాణం చేపట్టినట్లు గుర్తించింది. సీకెంట్ ఫైల్స్ పూర్తిగా కూలిపోయిన ఘటనలు, పైభాగం, కిందభాగాల్లో కనిపించిన రంధ్రాలు.. ఇవన్నీ ప్రధాన నిర్మాణ లోపాలను సూచిస్తున్నాయి.

అన్నారం, సుందిళ్ల బ్యారేజీలను తొలుత ఊహించిన చోట కాకుండా వేరే ప్రాంతాల్లో నిర్మించడమూ మరో ప్రధాన తప్పిదంగా పేర్కొంది. జాతీయ ఆనకట్టల భద్రత చట్టం-2021 ప్రకారం వర్షాకాలానికి ముందు నిర్దిష్టంగా నిర్వహించాల్సిన తనిఖీలను పూర్తిగా నిర్లక్ష్యం చేశారని నివేదికలో వివరించారు. రీ-డిజైన్ చేయకపోతే ఈ బ్యారేజీలు ఉపయోగించదగ్గవిగా ఉండబోవని స్పష్టం చేసింది.

ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టును తెలంగాణ రాజకీయాల్లో వివాదాస్పదం చేస్తోంది. జస్టిస్ ఘోష్ కమిషన్ ఇప్పటికే కాళేశ్వరం అక్రమాలపై విచారణ జరుపుతుండగా, ఈ నివేదిక కీలక ఆధారంగా మారే అవకాశం ఉంది. భవిష్యత్‌లో మాజీ మంత్రులు హరీష్ రావు, కేటీఆర్ వంటి బీఆర్ఎస్ నేతలపై ప్రశ్నలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఒకప్పుడు కేసీఆర్ ప్రభుత్వం అత్యంత గర్వంగా చూపించిన ఈ ప్రాజెక్ట్ ఇప్పుడు ప్రభుత్వ వ్యయ వ్యర్థతపై పెద్ద చర్చకు దారితీస్తోంది. ప్రాజెక్ట్ ఆధారంగా మూడోసారి అధికారంలోకి రావాలని భావించిన బీఆర్ఎస్‌కు ఇది రాజకీయంగా భారీ దెబ్బగా మారిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

రాజాసాబ్‌ పుకార్లు| Cine Critic Dasari Vignan About Prabhas Raja Saab Release | Directo Maruthi |TR