కాంగ్రెస్ కు షాక్… రాజీనామా చేసిన సీనియర్ మహిళా నేత

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో రాజీనామాల పర్వం కొనసాగుతూనే ఉంది. రోజుకో నేత పార్టీకి రాజీనామా చేసి కారెక్కుతున్నారు. పార్టీ నుంచి నేతలు చేజారకుండా దిద్దుబాటు చర్యలు చేపట్టాల్సిన నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో జరగాల్సిన నష్టం జరుగుతోంది.

మహదేవ్ పూర్ కు చెందిన నాయకురాలు, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకురాలు రాణిబాయి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు. మాజీ ఎంపీ వివేకానంద, మాజీ ఎమ్మెల్యే పుట్టమధు ఆధ్వర్యంలో ఆమె టిఆర్ఎస్ పార్టిలో చేరారు. 30 ఏండ్లుగా పార్టీ కోసం పని చేస్తున్నా కనీసం తనకు విలువ ఇవ్వలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. శ్రీధర్ బాబు ఒంటెద్దు పోకడల వల్లే పార్టీ నాశనమవుతుందన్నారు.

కరీంనగర్ లో కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాల్సిన వారు ఇంకా నాశనం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీ ఎన్నికలు జరిగి రెండు నెలలు కావస్తున్నా కనీసం సమీక్షా సమావేశం నిర్వహించకపోవడాన్ని చూస్తుంటే పార్టీ పరిస్థితి అర్దమవుతుందన్నారు. టిఆర్ ఎస్ పార్టీలో ప్రజల సంక్షేమం కోసం కృషి చేస్తానని రాణిబాయి అన్నారు.