తనకు ప్రాణహాని ఉందని కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనకు ప్రత్యర్ధి రాజకీయ పార్టీల నుంచి , సంఘ విద్రోహుల నుంచి ప్రాణ హాని ఉందని హైకోర్టులో రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.తనకు ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరినా పట్టించుకోవడంలేదని రేవంత్ రెడ్డి పిటిషన్ లో పేర్కొన్నారు.
తనకు ప్రాణహాని ఉన్న నేపథ్యలో 4+4 భద్రత కల్పించేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఆదేశించాలని కోరారు. ఈ పిటిషన్ లో కేంద్ర న్యాయశాఖ కార్యదర్శి, తెలంగాణ సీఎస్, కేంద్ర ఎన్నికల కమిషనర్, రాష్ట్ర ఎన్నికల కమిషనర్, డిజిపి వికారాబాద్ ఎస్పీలను రేవంత్ రెడ్డి ప్రతివాదులుగా చేర్చారు.

రేవంత్ రెడ్డి తనకు ప్రాణహాని ఉందని భద్రత కల్పించాలని గతంలోనే ప్రభుత్వాన్ని డిజిపిని కోరారు. అప్పుడు విచారించిన పోలీసు శాఖ భద్రత పరమైన ఇబ్బందులు లేవని భద్రత కల్పించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. దీంతో రేవంత్ తనకు రాష్ట్ర ప్రభుత్వం పై నమ్మకం లేదని భద్రత కల్పించాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారు. అయితే కేంద్ర హోం శాఖ నుంచి రేవంత్ కు సమాచారం రాలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో ఎన్నికలు రావడంతో రేవంత్ ప్రచార నిమిత్తం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నారు.

ప్రత్యర్ధి పార్టీలు, కొంత మంది విద్రోహులు తన పై దాడులు చేయాలని భావిస్తున్నారన్నారు. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రచారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా పర్యటిస్తున్నప్పుడు ఎక్కడైనా దాడులు జరిగే అవకాశం ఉందని రేవంత్ అనుమానాలు వ్యక్తం చేశారు. తన పై దాడులు జరిగితే తెలంగాణ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబానిదే బాధ్యత అని రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. ఈ నేపథ్యంలో రేవంత్ తనకు భద్రత కల్పించాలని హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ విచారణ బుధవారం లేదా గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉంది.
రేవంత్ రెడ్డికి రక్షణ విషయంలో రేవంత్ అనుచరుల్లో ఆందోళన మొదలైంది. అధికార పార్టీ వారు కావాలనే పలు కేసులలో ఇరికించి ఇబ్బందులకు గురిచేస్తున్నారన్నారు. ప్రభుత్వ మోసాలను ప్రజలకు వివరించి చెబుతున్నందుకు కేసీఆర్ కుటుంబం కావాలని రేవంత్ పై కుట్ర పన్నుతుందని వారు ఆరోపించారు. రేవంత్ కు భద్రత కల్పించాలని గతంలోనే కోరినా ఎందుకు కల్పించలేదో ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. ఎన్నికల ప్రచారం కోసం రేవంత్ తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తున్నందున ఆయనకు రక్షణ కల్పించాలని వారు డిమాండ్ చేశారు.

రేవంత్ రెడ్డి స్వయంగా డిజిపికి, ప్రభుత్వానికి లేఖలు రాసినా కూడా కనీసం స్పందించకుండా భద్రత అవసరం లేదని తేల్చడం ఎంత వరకు సబబని వారు ప్రశ్నించారు. ఒక జాతీయ స్థాయి పార్టీ నేతకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రేవంత్ రెడ్డికి ఏం జరిగినా ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రేవంత్ రెడ్డికి రక్షణ కల్పించాలని హైకోర్టులో సరైన తీర్పు రాకుంటే సుప్రీం కోర్టును ఆశ్రయిస్తామన్నారు.
