తెలంగాణలో కరోనా వైరస్ మహమ్మారి పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ రోజు కూడా కేసుల సంఖ్య పెరిగింది. అయితే సామాన్యులతో పాటు, ప్రజా ప్రతినిధులు, అధికారులు సైతం వైరస్ బారిన పడుతున్నారు.
తాజాగా తెలంగాణలో మరో టీఆర్ ఎస్ ఎమ్మెల్యే కరోనా వైరస్ మహమ్మారి బారిన పడ్డారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాష్గౌడ్ కి కరోనా పాజిటివ్గా నిర్దారణ అయ్యింది.
గత రెండు రోజులుగా నీరసంగా ఉండటంతో కరోనా నిర్ధారణ పరీక్ష చేయించుకున్నారు. దీంతో ఆయనకు పాజిటివ్ గా తేలింది. మరోవైపు గడిచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 635 పాజిటివ్ కేసులు నమోదు అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్ సంఖ్య 2,82,982కు చేరుకోగా.. రికవరీ కేసులు 2,74,833కు పెరిగాయి. కరోనాతో మరో నలుగురు మృతిచెందారు. దీంతో ఇప్పటి వరకు కోవిడ్ బారినపడి మరణించిన వారి సంఖ్య 1522కు చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 6,627 యాక్టివ్ కేసులు ఉండగా.. వీరిలో 4,467 మంది హోం ఐసోలేషన్లోనే ఉన్నారు.