సానియా మీర్జా పై బిజెపి ఎమ్మెల్యే రాజా సింగ్ సంచలన వ్యాఖ్యలు (వీడియో)

తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా సానియా మీర్జాను తొలగించాలని బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ డిమాండ్ చేశారు. సానియా మీర్జా పాక్ కోడలు అని పాక్ తో భారత్ ఎటువంటి సంబంధాలు కోరుకోవడం లేదన్నారు. రాజాసింగ్ ఓ వీడియోను సోషల్ మీడియాకు విడుదల చేశారు. అందులో ఏమన్నారంటే…

‘నమస్కారం.. నా తెలంగాణ ప్రజల్లారా.. తెలంగాణకు బ్రాండ్‌ అంబాసిడర్‌గా మన ముఖ్యమంత్రి.. సానియా మీర్జాను నియమించారు. ఆమె ఎవరు?.. పాకిస్తాన్‌ కోడలు. పెళ్లి అయిపోయిన తర్వాత ఆమె ఆ దేశం కోడలు అవుతుంది. అలాంటి పాకిస్తాన్‌ కోడలిని సీఎం తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా చేశారు. ముఖ్యమంత్రిగారికి నేను ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఇవ్వాళ మన సైన్యంపై పాక్‌ ఉగ్రవాదులు దాడి చేశారు.

ఈ ఘటనలో ఎంతో మంది జవాన్లు అమరులయ్యారు. ప్రతీ దేశం పాక్‌ను వ్యతిరేకిస్తుంది. భారత్‌ కూడా అన్నిరకాల మద్దతును ఉపసంహరించుకుంది. మీరూ కూడా పుట్టిన రోజు జరుపుకోలేదు. ఈ విషయం తెలిసి చాలా సంతోష పడ్డాను. సానియామీర్జాను ప్రచారకర్తగా తొలగించి పీవీ సింధూ, సైనా నెహ్వాల్‌లో ఒకరిని నియమించండి. ఈ విషయంపై ఒక సారి ఆలోచించండి’ అని రాజాసింగ్‌ విజ్ఞప్తి చేశారు.

భారత్ పాక్ ల మధ్య ఏం జరిగినా సానియా మీర్జాకు ట్రోలింగ్ గా మారుతున్నాయి. దేశమంతా సైనికులు చనిపోయిన బాధలో ఉంటే సానియా తన డ్రెస్సుల గురించి సోషల్ మీడియాలో పోస్టు చేయడం వివాదంగా మారింది. చివరకు అసహనాన్ని వ్యక్తం చేస్తూ సానియా వివరణ ఇవ్వడం కూడా వివాదంగా మారింది.  రాజాసింగ్ మాట్లాడిన వీడియో కింద ఉంది చూడండి.