బడి పిల్లల మెడకు గులాబీ గంటలు, వివాదంలో టిఆర్ఎస్ అభ్యర్థి

ముక్కు పచ్చలారని పిల్లలు అంటే ఎవరు అని అడగగానే మనకు టక్కున వచ్చే సమాధానం చిన్న పిల్లలు. పిల్లలు దేవుళ్లతో సమానం అంటారు. ఆ పిల్లల జాబితాలో బడి పిల్లలు కూడా ఉంటారు. మరి బడి పిల్లలు రోజువారి చేసే పనేముంటది లేస్తే తయారై బడికి పోతరు. బడి నుంచి వచ్చి హోంవర్క్ చేసుకుంటరు. తింటరు. పడుకుని మల్లా తెల్లారి లేసి బడకి పోవుడే వాళ్ల పని. కానీ ఆ బడి పిల్లలు నేడు గులాబీ కండువాలు కప్పించుకుంటున్నారు. వారు కప్పించుకుంటున్నారనే కంటే తల్లిదండ్రులు కప్పిస్తున్నారు.

తమ శిబిరంలో మంది నిండుగ కనబడాలని గులాబీ లీడర్లు బడి పోరలు అని కూడా చూడకుండా గులాబీ కండువాలు కప్పి పారేస్తున్నరు. టిఆర్ఎస్ పార్టీలో జాయినింగ్ చేపించుకుంటున్నరు. జాయినింగ్ అయితే చేపించుకుంటున్నరు కానీ వాళ్లకు ఓటు హక్కు ఉందో లేదో కూడా చూసుకోకుండా ఇలా ఎందుకు చేస్తున్నరో ఎవలికి సమజ్ కాట్లేదు. 

తాజాగా ఒక టిఆర్ఎస్ లీడర్ తనకు బొచ్చెడు మంది మద్దతు ఉందని నమ్మబలికేందుకు జాయినింగ్ కార్యక్రమం పెట్టుకున్నడు. ఈ జాయినింగ్ కార్యక్రమం అంటే ఎవలికి తెల్వని ముచ్చట కాదు గదా? ఎంత మంది వస్తే అంత మందికి గులాబీ కండువాలు కప్పిండు. కానీ అందులో బడి పోరగాళ్లు ున్న ముచ్చట మరచిపోయిండు. ఆ లీడర్ ఎవరో చదవండి.

ఓటు హక్కు కూడా లేని బడి ఈడు పిల్లలకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానిస్తున్న ముద్దగోని

జిహెచ్ఎంసి పరిధిలోని హాట్ హాట్ నియోజకవర్గాల్లో ఎల్ బి నగర్ కూడా ఒకటి. ఈ నియోజకవర్గం నుంచి గతంలో టిడిపి తరుపున బిసి సంఘం నేత ఆర్. కృష్ణయ్య ఎన్నికయ్యారు. ఆయన తర్వాత టిడిపితో పెద్దగా అంటగాకలేదు. దూరంగా ఉండి బిసి ఉద్యమాలే చేస్తూ వచ్చారు. ఈసారి ఇక్కడ ఎలాగైనా పాగా వేయాలని టిఆర్ఎస్ పార్టీ కసరత్తు చేస్తున్నది. గతంలో పోటీ పోటీ చేసి ఓడిపోయిన రామ్మోహన్ గౌడ్ ను మళ్లీ బరిలోకి దింపింది.

దీంతో నియోజకవర్గంపై పట్టు సాధించేందుకు రామ్మోహన్ గౌడ్ కరసత్తు చేస్తున్నారు. భారీ చేరికల ద్వారా ప్రత్యర్థులకు సవాల్ విసిరే పనిలో ఉన్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా.. జాయినింగ్స్ లో బడి పిల్లలను తీసుకుని వచ్చారు కొందరు తల్లిదండ్రులు. కానీ రామ్మోహన్ గౌడ్ అవేవీ పట్టించుకోకుండా వారికి కండువాలు కప్పేసి జాయినింగ్ అయిపోయిందనిపించుకున్నారు.

ముద్దగోని రామ్మోహన్ గౌడ్ సమక్షంలో టిఆర్ఎస్ పార్టీలో చేరిన బడి పోరడు

ఇక ప్రధాన మీడియా పాలకులకు జి హుజూర్ అంటున్నవేళ సోషల్ మీడియా ఊకుంటదా? ఈ ముచ్చటను బయటపెట్టింది. బడి పిల్లలకు కండువాలు కప్పి సమాజానికి రామ్మోహన్ గౌడ్ ఏం మెసేజ్ ఇస్తున్నట్లు అని సోషల్ మీడియాలో విమర్శల వర్షం కురుస్తున్నది. పార్టీలో చేర్చుకునే రామ్మోహన్ గౌడ్ కు అవగాహన లేకపోయినా కనీసం తల్లిదండ్రులకైనా కొంచెమైనా ఆలోచన ఉండొద్దా అని సెటైర్లు పేలుతున్నాయి.

ఈ వయసులో పార్టీలో జాయినింగ్ చేయించడం, బడి బందు చేసి రోజు వారీ లీడర్లు ఇచ్చే డబ్బుల కోసం పార్టీల ప్రచారాలకు తిప్పితే వారి భవిష్యత్తు ఏమైతుందో ఆలోచించడం లేదా అని నిలదీస్తున్నారు నెటిజన్లు. ఇకనుంచైనా ఈ కల్చర్ ను అటు లీడర్లు, ఇటు తల్లిదండ్రులు విడనాడాలని నెటిజన్లు కోరుతున్నారు.