హైదరాబాద్, తెలంగాణ: తెరాస ప్రభుత్వం రూపొందించిన నూతన ఎలక్ట్రిక్ వెహికల్(ఈవీ) పాలసీని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం ఆవిష్కరించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో తెలంగాణ ఈవీ సమ్మిట్లో ఈ పాలసీ విధానాన్ని ప్రకటించారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించేలా పాలసీ రూపొందించారు. ఈ కార్యక్రమంలో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్, నీతి ఆయోగ్ సీఈవో అమితాబ్కాంత్, మహీంద్రా అండ్ మహీంద్రా ఎండీ పవన్కుమార్ గోయెంకా, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్రంజన్… ముఖ్య అతిధిగా హీరో విజయ్ దేవరకొండ పాల్గొన్నారు. 2020-2030 వరకు తెలంగాణలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, వినియోగానికి సంబంధించి ఈ పాలసీని రూపొందించారు. రాష్ట్రాన్ని ఎలక్ట్రిక్ వాహనాల హబ్గా మార్చాలనే లక్ష్యంతో ఈ నూతన విధానాన్ని ప్రకటించారు.
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ.. దేశంలో వేగంగా అభివృద్ది చెందుతున్న ఆర్థిక వ్యవస్థలలో తెలంగాణ ఒకటని.. గత ఐదేళ్లలో రాష్ట్రంలో సగటు వార్షిక జీఎస్డీపీ 14.2 శాతం ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వం 178 చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. టీఎస్ఆర్టీసీ కూడా 40 ఎలక్ట్రిక్ బస్సులను వాడుకలోకి తెచ్చిందని అన్నారు. సుస్థిర, పునరుత్పాదక ఇంధన రంగంలో తెలంగాణ అగ్రగామిగా ఉందన్నారు. సోలార్ పవర్ ఉత్పత్తిలో దేశంలో అగ్రస్థానంలో ఉన్న రాష్ట్రాల్లో తాము కూడా ఉన్నామని చెప్పారు.
ఇప్పటికే 2020-2030 కాలానికి ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన విధానాలను వెల్లడిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలోనే కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకునే వారికి పలు రాయితీలను ఇవ్వనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది. ఇందులో భాగంగా తొలి 2 లక్షల ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాలు, 20వేల ఆటోలు, మొదటి 5వేల 4 చక్రాల వాహనాలు, మొదటి 10వేల లైట్ గూడ్స్ వాహనాలు, మొదటి 5వేల ఎలక్ట్రిక్ కార్లు, 500 ఎలక్ట్రిక్ బస్సులకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుం మినహాయింపు ఇవ్వనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. ఎలక్ట్రిక్ ట్రాక్టర్లకు రహదారి పన్ను, రిజిస్ట్రేషన్ రుసుం పూర్తిగా తొలగించనున్నట్లు తెలిపింది. ప్రజా రవాణా వ్యవస్థలోనూ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగానికి ప్రోత్సాహం అందిస్తూ ఛార్జింగ్ అవసరాల కోసం అవసరమైన చర్యలు చేపట్టనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది.