అప్పుల్లో కెసియార్, కొడుక్కి కోడలికి కోటి రుపాయలు బాకీ

రాజకీయాల్లో చాలా డ్రామాలంటాయి. ముఖ్యంగా ఎన్నికలపుడు ఎన్నికల కమిషన్ కు సమర్పించే అఫిడవిట్ చాలా వింతలపుట్ట. అందులో బయో డేటా వివరాలు తప్ప మిగతా వన్నీ ప్రపంచ వింతల్లో చేరతాయి. ఇపుడు తెలంగాణలో ఓట్ల సీజన్ నడుస్తున్నందున ఆశ్చర్యకరమయిన అఫిడవిట్లు ఫైలవుతున్నాయి.  ముఖ్యమంత్రి కెసియార్ నిన్న గజ్వేల్ నియోజకవర్గానికి నామినేషన్ వేస్తూ ఎన్నికల కమిషన్ కు సమర్పించిన అఫడవిట్ లో ఎన్ని వింతలున్నాయో చూడండి

ఆయన తన వృత్తిని వ్యవసాయంగా చెప్పుకున్నారు. 2014 లో బిజినెస్ ,వ్యవసాయం అని చెప్పారు. బిజినెస్ ఏమయిందో మరి, ఇపుడు కేవలం రైతును మాత్రమే అని చెప్పుకున్నారు.

ఆయితే,వ్యవసాయం నుంచి ఆయనకు వస్తున్న వార్షికాయదాయం రు. 91.5 లక్షలు. తెలంగాణాలో ఒక విధంగా సూపర్ రిచ్ రైతు ఆయనే.

ఆయనకు 54 ఎకరాల ఫామ్ హౌస్ ఉంది. దాని మీద ఆయన రు. 3.2 కోట్లు వెచ్చిం చారు. ఫామ్ హౌస్ విలువ రు. 6.5 కోట్లు. మొదట్లో ఆయనకు 37 ఎకరాలుండేది, ముఖ్యమంత్రి అయ్యాక అది 54 ఎకరాలకు పెరిగింది.

ఆయన మొత్తం ఆస్తి విలువు రు. 22 కోట్లు. 2014 లో ఆయన ఆస్తి 15 కోట్లు. గత నాలుగున్నరేళ్లలో రు. 7 కోట్లు పెరిగింది. మంచి వృద్ధి.

కారు పార్టీ వోనరయినా ఆయనకు సొంత కారు లేదు.

కొడుకు కెటియార్ నుంచి రు. 84 లక్షలు, కోడలు శైలిమానుంచి రు. 24 లక్షలు అప్పు తీసుకున్నారు.

బ్యాంకు లనుంచి లోన్ తీసుకోలేదు. కాకపోతే, స్నేహితులనుంచి చేబదుల్లు తీసుకున్నారు.ప్రతిమా గ్రూప్ ఛెయిర్మన్ బోయినపల్లి శ్రీనివాసరావు, ఆయన భార్య ఉషారాణి నుంచి లోన్ తీసుకున్నారు.

అదే విధంగా ఆయన మాజీ కాంగ్రెస్ ఎంపి, ఇపుడు టిఆర్ ఎస్ నేత జి వివేకానంద నుంచి రు. 1.06 లోన్ తీసుకున్నారు.
కొడుకు నడిపే టివిచానెల్, న్యూస్ పేపర్లో షేర్లున్నాయి.

భార్యకు 2.4 లక్షల రుపాయల విలువైన నగలు, రు. 93 లక్షలవిలువయిన వజ్రాలున్నాయి.
కెసియార్ మీద 63 కేసులున్నాయి.