కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి మరో షాక్

కాంగ్రెస్ నేత రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలింది. రేవంత్ రెడ్డికి కేంద్ర బలగాల రక్షణ కల్పించాలని హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పు పై డివిజన్ బెంచ్ స్టే విధించింది. తనకు ప్రాణ హాని ఉందని రేవంత్ హైకోర్టులో పిటిషన్ వేయగా విచారించిన హైకోర్టు డివిజన్ బెంచ్ రేవంత్ కు 4+4 కేంద్ర బలగాల భద్రత కల్పించాలని ఆదేశాలిచ్చింది. కానీ దానిని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అమలు చేయలేదు. రేవంత్ కు రాష్ట్ర బలగాలతో భద్రత కల్పిస్తామని ప్రభుత్వం చెప్పింది. దానికి రేవంత్ ఒప్పుకోలేదు. హైకోర్టు తీర్పును అమలు చేయడం లేదంటూ రేవంత్ మళ్లీ కోర్టు మెట్లు ఎక్కడంతో విచారించిన డివిజన్ బెంచ్ కేంద్ర బలగాల భద్రత అక్కర్లేదని రాష్ట్ర బలగాల భద్రతే 4+4 కల్పించాలని ఆదేశాలిచ్చింది.  రేవంత్ భద్రత అంశం తమ పరిధిలోకి రాదని కేంద్రం అప్పీల్ చేసింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకున్న డివిజన్ బెంచ్ రేవంత్ కు ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు 4+4 భద్రతతోపాటు ఎస్కార్ట్ కల్పించాలని ఆదేశించింది. 

రేవంత్ రెడ్డికి ఇది ఎదురు దెబ్బగా చెప్పవచ్చని పలువురు నేతలు తెలిపారు. రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచార నిమిత్తం తెలంగాణ అంతటా పర్యటిస్తున్నారు.  తన పై దాడులు జరిగే ప్రమాదం ఉందని ఆయన మూడు రోజుల ప్రచార కార్యక్రమాలు కూడా రద్దు చేసుకున్నారు. శుక్రవారం ఉదయం రేవంత్ ఏమన్నారంటే

“నా ప్రాణాలకు హాని ఉంది. ఎన్నికల ప్రచారంలో నా మీద దాడులు చేసేందుకు కుట్ర పన్నారు. దీనిపై నాకు పక్కా సమాచారం ఉంది. ఇదే విషయాన్ని పోలీసులకు చెప్పినా వారు పట్టించుకుంటలేరు. మావోయిస్టుల ముసుగులో నాపై దాడులు జరిపేందుకు కుట్ర జరుగుతున్నది. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నానని కేసీఆర్ అండ్ కొ నన్ను అంతమొందించేందుకు కుట్ర చేస్తున్నారు. నా అడ్డు తొలగించుకుంటానని కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారు. ఆపరేషన్ బ్లూ స్టార్ చేస్తా అన్నారు. నేను తెలంగాణ వ్యాప్తంగా పర్యటిస్తూ వారి ఆగడాలను ఎత్తి చూపుతున్నానని నాపై దాడులు చేసేందుకు రౌడీలతో కుట్ర చేశారు. నాకు 4+4 భద్రత కల్పించాలని హైకోర్టు తీర్పు ఇచ్చినా కూడా దానిని అమలు చేయకుండా కుట్ర చేశారు. మహేందర్ రెడ్డి డిజిపి అయ్యాక నా పై దాడులకు ప్రణాళికలు ఎక్కువయ్యాయి. నా కార్యకర్తలను వేధిస్తున్నారు. నేను వారి తప్పులను ప్రశ్నించడమే నేరమా? అందుకోసమే ఇవాళ మహబూబ్ నగర్, ఖమ్మం జిల్లాలో ఉన్న పర్యటనను రద్దు చేసుకుంటున్నాను. నాకు కేంద్ర బలగాల రక్షణ కల్పించేంత వరకు కూడా నేను బయటికి వెళ్లను’’  అని రేవంత్ ప్రకటించారు.

రేవంత్ ఈ ప్రకటన చేసిన కొద్ది గంటలకే హైకోర్టు తీర్పునిచ్చింది. రేవంత్ రెడ్డికి కేంద్ర బలగాల భద్రత అక్కర్లేదని రాష్ట్ర ప్రభుత్వ భద్రత సరిపోతుందని తీర్పునిచ్చింది. దీని పై రేవంత్ అనుచరులు ఆందోళన చెందుతున్నారు. రేవంత్ రెడ్డి ప్రాణాలకు హాని ఉందని ఒకవైపు ఆందోళన చెందుతుంంటే… మరోవైపు హైకోర్టు తీర్పు ఇలా రావడంతో వారు మరింద భయపడుతున్నారు. రేవంత్ భద్రత పై కుటుంబ సభ్యుల్లోనూ, కాంగ్రెస్ నేతల్లోను ఆందోళన మొదలైనట్టు తెలుస్తోంది.

ఇదిలా ఉంటే రేవంత్ భద్రత విషయంలో న్యాయ పోరాటం చేసే ఆలోచనలో రేవంత్ వర్గం ఉన్నట్లు సమాచారం అందుతోంది.