కొండా దంపతులు కార్యకర్తలతో కాళ్లు మొక్కించుకున్నారు: గుండు సుధారాణి

కొండా దంపతులకు కేసీఆర్ ను విమర్శించే అర్హత లేదని టిఆర్ ఎస్ మహిళా విభాగం అధ్యక్షురాలు గుండు సుధారాణి విమర్శించారు. 2014లో దిక్కు లేని స్థితిలో కేసీఆర్ దగ్గరకు వస్తే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారని దానిని కొండా దంపతులు మరిచి పోవద్దని విమర్శించారు. దొరల పాలన గురించి మాట్లాడుతున్న కొండా దంపతులకు టిఆర్ ఎస్ లోకి వచ్చినప్పుడు కేసీఆర్ దొర అని తెలియదా అని ప్రశ్నించారు.

దొరల కుటుంబంలో పుట్టినా ఏ నాడు అహం ప్రదర్శించకుండా అన్ని సామాజిక వర్గాల కోసం ఆలోచించి పరిపాలన చేస్తున్న గొప్ప వ్యక్తి కేసీఆర్ అని అటువంటి వ్యక్తి గురించా వీరా మాట్లాడేదని సుధారాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.

వరంగల్ ప్రజలు ఇప్పుడిప్పుడే స్వేచ్చ వాయువులు పీలుస్తున్నారని పార్టీలో ఎటువంటి విబేధాలు లేవన్నారు. పదవుల కోసం పార్టీలు మారే అలవాటు కొండా ఫ్యామిలీకి ఉందని అందుకే అన్ని పార్టీల వారిని సంప్రదిస్తున్నారని సుధారాణి ఎద్దేవా చేశారు. కొండా దంపతులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలని హెచ్చరించారు.

కార్యకర్తలు, నేతలతో కాళ్లు ఒత్తించుకునే నీచ సంస్కృతి కొండా దంపతులదన్నారు. కొండా దంపతులను ప్రజలు వివ్వసించరని దమ్ముంటే కొండా దంపతులు ఎమ్మెల్యేగా, ఎమ్మెల్సీలుగా మళ్లీ గెలవాలని సవాల్ విసిరారు. బీసీ నేతలుగా ఉన్నా దొరలుగా కొండా దంపతులు ప్రవర్తించారని గుండు సుధారాణి విమర్శించారు.