కొడంగల్ ఫాం హౌజ్ లో దొరికిన నోట్ల కట్టలపై ఈసి సీరియస్ అయ్యింది. బుధవారం కొడంగల్ టిఆర్ఎస్ అభ్యర్ది పట్నం నరేందర్ రెడ్డి మామ జగన్నాథరెడ్డి ఇంట్లో దొరికిన నగదు పై తమకు సమాచారం ఉందని ఎన్నికల కమిషనర్ రజత్ కుమార్ స్పందించారు. కొడంగల్ లో దొరికిన నగదు పై సీల్డు కవర్ లో నివేదికను సమర్పించాలని అధికారులను ఆదేశించామన్నారు. నివేదిక ఆధారంగా తదుపరి చర్య తీసుకుంటామని రజత్ కుమార్ తెలిపారు. ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకున్నామని నిబంధనలకు విరుద్దంగా ఎవరూ వ్యవహరించిన వదిలి పెట్టేది లేదని స్పష్టం చేశారు. అందరిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని రజత్ కుమార్ అన్నారు.

ఈ కేసుకు సంబంధించి అసలు వివరాలు ఏంటంటే…. ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్ది రాజకీయ నాయకుల ఇండ్లలో డబ్బుల కట్టలు బయటపడుతూనే ఉన్నాయి. కొడంగల్ లో టిఆర్ఎస్ అభ్యర్ది నరేందర్ రెడ్డి బంధువు ఇంట్లో భారీగా నగదు బయటపడడంతో కలకలం రేగింది. పట్నం నరేందర్ రెడ్డి మామ జగన్నాథ రెడ్డి ఫాం హౌజ్ లో అధికారులు సోదాలు నిర్వహించగా 51 లక్షల రూపాయలు పట్టు బడ్డాయి.
కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గి మండలం మీర్జాపూర్ గ్రామంలో పట్నం నరేందర్ రెడ్డి మామ జగన్నాథరెడ్డి ఫాం హౌజ్ ఉంది. అక్కడ అక్రమంగా నగదు దాచిపెట్టారని అధికారులకు పక్కా సమాచారం అందింది. వెంటనే అధికారులు అక్కడకు చేరుకొని నరేందర్ రెడ్డి మామ ఫాం హౌజ్ తో పాటు ఇతర ఆస్తుల పై దాడులు చేశారు. నరేందర్ రెడ్డి బావ మరిది శ్రీధర్ రెడ్డి కార్యాలయంలోను సోదాలు నిర్వహించారు.

ఎన్నికల సంధర్బంగా కార్యకర్తలతో హడావుడిగా కనిపించిన ఫాం హౌజ్ ఐటి అధికారుల సోదాతో వెలవెల పోయింది. ఈ సోదాల్లో ఫాం హౌజ్ లోనే 51 లక్షల రూపాయలు పట్టుబడ్డాయి. మిగిలిన ప్రాంతాలలో నగదు పట్టుబడలేదు. పలు ఆస్తులకు సంబంధించిన పత్రాలను కూడా అధికారులు స్వాధీన పరుచుకున్నారు. కొడంగల్ లో అధికార టిఆర్ఎస్ అభ్యర్ధి బంధువు ఇంట్లో భారీగా నగదు పట్టుకోవడంతో ఒక్క సారిగా కలకలం రేగింది.
కొడంగల్ కాంగ్రెస్ అభ్యర్ధిగా రేవంత్ రెడ్డి పోటి చేస్తున్నారు. కొడంగల్ లో రేవంత్ రెడ్డికి, పట్నం నరేందర్ రెడ్డికి మధ్య చాలా ఉత్కంఠపోరు ఏర్పడింది. రేవంత్ రెడ్డి తన నియోజకవర్గమే కాకుండా కాంగ్రెస్ తరపున రాష్ట్రమంతా పర్యటిస్తున్నారు. రేవంత్ రెడ్డి ఇంట్లో కూడా నెల రోజుల కింద ఐటి దాడులు జరిగాయి. అక్కడ ఎటువంటి నగదు కూడా దొరకలేదు. రేవంత్ కు సంబంధించిన ఆస్తుల పత్రాలను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇంత వరకు ఆ కేసు పూర్వాపరాలు అధికారులు వెల్లడించలేదు. తాజాగా నరేందర్ రెడ్డి ఇంట్లో దాడులు జరగడంతో కాంగ్రెస్ వారే కావాలని దాడులు చేయించారని టిఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు.
కొడంగల్ లో 100 కోట్ల మూటలు దింపారని అవి ఏవి కూడా తనను ఓడించలేవని రేవంత్ గతంలోనే ప్రకటించారు. రేవంత్ రెడ్డి అనే శక్తిని ఎదుర్కొనేందుకు టిఆర్ఎస్ లోని అన్ని శక్తులు ఏకమయ్యాయని ఆ శక్తులేవి కూడా తనను ఏం చేయలేవన్నారు. రేవంత్ రెడ్డి చెప్పినట్టే కొడంగల్ లో వంద కోట్లు దిగాయని కాంగ్రెస్ నేతలు ఆరోపిస్తున్నారు.

పట్నం నరేందర్ రెడ్డి బంధువు ఇంట్లో డబ్బు దొరకడం పై కొడంగల్ కాంగ్రెస్ నేతలు స్పందించారు. ఐటి అధికారులకు కాంగ్రెస్ పార్టీ సమాచారం ఇవ్వలేదన్నారు. గత వారం రోజులుగా కొడంగల్ వ్యాప్తంగా టిఆర్ఎస్ నాయకులు డబ్బులు పంచుతూ, యువకులకు తాపిస్తూ ఉన్న విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. అందరికి డబ్బులు , మందు పంచి ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారని వారు మండి పడ్డారు. ఎవరెన్ని కుట్రలు చేసినా కొడంగల్ లో కాంగ్రెస్ అభ్యర్ధి రేవంత్ రెడ్డి విజయం ఖాయమన్నారు.
