కేసీఆర్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు

ఏపీలోని ప్రజల సమాచారాన్ని హైదరాబాద్ లో ఉన్న ఓ సంస్థ నిర్వహిస్తుంటే దాన్ని తస్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వం కుట్రలు చేస్తోందని ఏపీ సీఎం చంద్రబాబు నిప్పులు చెరిగారు. ఐటి గ్రిడ్ సంస్థ ఏపీలోని ప్రజల డేటాను బహిర్గతం చేస్తోందని వచ్చిన ఫిర్యాదుతో తెలంగాణ పోలీసులు దాడులు చేశారు. దీని పై చంద్రబాబు స్పందించి కేసీఆరే లక్ష్యంగా విమర్శలు చేశారు.

తమకు సేవ చేసే కంపెనీనీ లక్ష్యంగా చేసుకొని దాడులు ఎలా చేస్తారని బాబు ప్రశ్నించారు. దీనిని సీరియస్ గా పరిగణిస్తున్నామన్నారు. తానిస్తున్న మర్యాదను కేసీఆర్ తప్పితే తాను చూస్తూ ఊరుకోనని హెచ్చరించారు. బాబు ఏమన్నారంటే…

“మాకు సేవ చేసే కంపెనీపై మీ ఏసీబీ పోలీసులు వచ్చి దౌర్జన్యం చేస్తారా? ఏమనుకున్నారు మీరు? ఇదంత ఈజీగా వదిలిపెట్టను. ఒక పక్క నరేంద్ర మోదీ… దాడులు చేసి ఉక్కిరిబిక్కిరి చేస్తే, ఇంకో పక్క కేసీఆర్ ఏపీ ఆస్తులపైన దాడులు చేస్తూ, లేనిపోని నోటీసులు ఇస్తూ, మనల్ని భయభ్రాంతులకు గురి చేయాలనుకుంటున్నారు. ఈ రెండూ కూడా సాగవు.

మర్యాదకు మర్యాద… అనవసరంగా మీరు రెచ్చిపోతే… మేము కూడా రెచ్చిపోవాల్సి వస్తుంది. ఇది గుర్తుపెట్టుకోమని హెచ్చరిస్తున్నా. అందుకనే ఇదంత ఈజీగా వదిలిపెట్టం. తెలంగాణ ప్రభుత్వం సమాధానం చెప్పాలి. మీరెవరు మా ఆఫీసుకు రావడానికి? ఏ చట్టం కింద వచ్చారు? ఏ రూల్ కింద వచ్చారు? ఏం వయొలేట్ చేశాము మేము? మీకేం సంబంధం?” అని ఆయన ప్రశ్నల వర్షం కురిపించారు. కేసీఆర్ కు చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇవ్వడంతో చర్చనీయాంశమైంది.