తెలంగాణ కాంగ్రెస్ కు బిగ్ షాక్.. మరో ఎమ్మెల్యే జంప్

తెలంగాణలో కాంగ్రెస్‌ పార్టీకి మరో ఎదురుదెబ్బ తగిలింది. కొల్లాపూర్‌ ఎమ్మెల్యే బీరం హర్షవర్థన్‌ రెడ్డి ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరనున్నారు. ఈ మేరకు తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్‌తో బుధవారం సమావేశమయ్యారు. త్వరలో పార్టీకి రాజీనామా చేసి తెరాసలో చేరుతానని ప్రకటించారు. అవసరమైతే పార్టీతో పాటు ఎమ్మెల్యే పదవి కూడా రాజీనామా చేస్తానని వెల్లడించారు. కొల్లాపూర్‌ నియోజకవర్గం అభివృద్ధికి కేటీఆర్‌ హామీ ఇచ్చారని ఈ సందర్భంగా చెప్పారు.

ఇప్పటికే కాంగ్రెస్‌ నుంచి పలువురి ఎమ్మెల్యేల చేరికతో తెరాస బలం 100కి చేరింది. నామినేటెడ్‌ ఎమ్మెల్యేతో కలిపి 101 ఉంది. మరో నలుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు ఆ పార్టీని వీడినట్లయితే అసెంబ్లీలో కాంగ్రెస్‌కు ప్రతిపక్ష హోదా పోతుంది. మరోవైపు మరో ఐదుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు తమతో చర్చలు జరుపుతున్నారని తెరాస చెబుతోంది.