కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు మరోసారి బయటకొచ్చాయి. మాజీ ఎమ్మెల్యే, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాకు చెందిన ఒక నేత తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. ఈ మేరకు పిసిసి అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డికి వెల్లడించారు. వివరాలివి.
కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చేందుకు బలమైన ఆయుధంగా బస్సు యాత్ర చేపట్టారు. బస్సు యాత్ర బాగానే కాంగ్రెస్ నాయకులను కదిలించింది. కేడర్ లో జోష్ నింపింది. ఈ పరిస్థితుల్లో బస్సు యాత్ర బాగుందని అనుకుంటున్న సమయంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. బస్సు యాత్ర కన్వీనర్ గా ఉన్న నిర్మల్ మాజీ ఎమ్మెల్యే మహేశ్వర్ రెడ్డి తన బాధ్యతల నుంచి తప్పుకున్నారు. బస్సు యాత్ర కన్వీనర్ పదవి అంటే రాష్ట్రమంతా తిరగాల్సి ఉన్నందున తన జిల్లాలో పనిచేయడానికి అసౌకర్యంగా ఉందని ఆయన ఉత్తమ్ కు స్పష్టంగా తెలిపారు. యాత్ర కన్వీనర్ పదవి నుంచి తప్పుకున్నంత మాత్రాన ఉత్తమ్ మీద వ్యతిరేకత ఏమాత్రం లేదని తెలిపారు. ఉత్తమ్ తో తనకు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. నాయకత్వం పట్ల తనకు ఎలాంటి అసంతృప్తి లేదన్నారు. జిల్లాలో పనిచేయడానికి సమయం కావాలన్న ఉద్దేశంతోనే కన్వీనర్ పదవీ బాధ్యతల నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. జిల్లాకు పరిమితం కావాలన్నదే తన అభిప్రాయం అన్నారు. కాంగ్రెస్ లో నే ఉంటానని చెప్పారు. పార్టీ అధికారంలోకి వచ్చేందుకు తన వంతు కృషి చేస్తానని అన్నారు. ఉత్తర తెలంగాణాలో మరింత స్ట్రాటజీతో ముందుకు వెళ్ళాలంటూ చిన్న మెలిక పెట్టారు.
అయితే ఆయన గురించి కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో వేరే రకమైన చర్చలు సాగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీలో పదవులున్నీ దక్షిణ తెలంగాణలోని రెండు జిల్లాలకే కట్టబెడుతున్నారని మహేశ్వర్ రెడ్డి గుర్రుగా ఉన్నట్లు వార్తలొస్తున్నాయి. పిసిసి చీఫ్, సిఎల్పీ నేత ఇద్దరూ నల్లగొండ నుంచే ఉన్నారని, మిగతా జాతీయ స్థాయి పదవుల్లో పాలమూరు నేతలు నిండిపోయారని ఆయన ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తొంది. పాలమూరులో జైపాల్ రెడ్డి, చిన్నారెడ్డి, సంపత్ కుమార్, చల్లా వంశీచంద్ రెడ్డి ఈ నలుగురికి జాతీయ స్థాయిలో పదవులు కట్టబెట్టింది అధిష్టానం. ఈ రెండు జిల్లాల నేతలనే పిసిసి ఎందుకు సిఫార్సు చేస్తోందని మహేశ్వర్ రెడ్డి బాధతో ఉన్నట్లు చెబుతున్నారు. తనకు జాతీయ స్థాయిలో పదవి వస్తుందని ఆయన ఆశించారు. కానీ కేవలం నల్లగొండ, పాలమూరు ఉమ్మడి జిల్లాల నాయకులే పదవులన్నీ కొట్టేశారని ఆయన మనస్థాపంతో ఉన్నారు. దీంతో తన పదవికి గుడ్ బై చెప్పారు.
అంతేకాదు బస్సు యాత్ర కో కన్వీనర్ గా ఉన్న పొంగులేటి సుధాకర్ రెడ్డి కూడా పిసిసి నాయకత్వం పట్ల గుస్సా ఉన్నట్లు చెబుతున్నారు. రేపో మాపో ఆయన కూడా కో కన్వీనర్ పదవికి గుడ్ బై చెప్పే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన ఆవేదనను ఎమ్మెల్సీ పొంగులేటి పార్టీ హైకమాండ్ కు లేఖ ద్వారా తెలిపినట్లు చెబుతున్నారు. అశోక్ గెహ్లట్ కు పూర్తి వివరాలతో ఒక లేఖ రాసినట్లు కాంగ్రెస్ వర్గాల్లో టాక్ నడుస్తోంది.
బస్సు యాత్రను నడపాల్సిన సారధులే తప్పుకుంటే రానున్న రోజుల్లో కాంగ్రెస్ బస్సు యాత్ర ఏమేరకు విజయవంతం అవుతుందన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఒకవైపు అధికార పార్టీ దూకుడు మీద ఉన్నది. ఇప్పటికే ప్రగతి నివేదన సభ పేరుతో భూమి ఆకాశం ఏకం చేసే పనిలో ఉన్నారు కేసిఆర్. ఈ పరిస్థితుల్లో ఇప్పటికే ప్రచార సామాగ్రి నియోజకవర్గాలకు చేర్చారు. కానీ కాంగ్రెస్ నేతలు మాత్రం ఒకరినొకరు పోట్లాడుకుంటూ కాలయాపన చేస్తున్నారు. అసలే ముందస్తు ముంచుకొస్తదేమో అన్న అనుమానాలున్న సమయంలో బస్సు యాత్ర సారధులు కాడి కింద పడేయడం కాంగ్రెస్ వర్గాలను కలవరపెడుతున్నది.
మహేశ్వర్ రెడ్డి కాంగ్రెస్ లోనే కొనసాగుతారా? లేక పార్టీ మారుతారా అన్న ప్రచారం కూడా ఉంది. ఉత్తర తెలంగాణలో స్ట్రాటజీ తో ముందుకు పోవాలన్న మెసేజ అందుకే ఇచ్చారని అంటున్నారు. పదవులన్నీ దక్షిణ తెలంగాణకే ఉన్నాయన్న ఉద్దేశంతోనే ఆయన పార్టీ నాయకత్వం మీద గుర్రగా ఉన్నట్లు చెబుతున్నారు.
