జగన్ హిమాలయ వేదాంతం పరువు తీస్తుందా..?

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘యూ-టర్న్’ అనే పదానికి సరికొత్త అర్ధాన్ని ఇస్తున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్, స్థానిక సంస్థల ఎన్నికల వేళ తన క్యాడర్‌కు మైండ్ బ్లాక్ అయ్యే రేంజ్ లో వేదాంతాన్ని బోధించారు. మొన్నటి దాకా “ఏకగ్రీవాలు జరిగితే ఇంచార్జ్ పదవులు ఊడిపోతాయి.. ఎన్నిక జరిగి తీరాల్సిందే.. సింగిల్ గా కొట్టాల్సిందే” అంటూ భీకరంగా గర్జించిన నోటితోనే, ఇప్పుడు సడన్ గా రూట్ మార్చేశారు. “మనకు ఈ ఎన్నికల్లో గెలుపు అస్సలు ముఖ్యం కాదు.. కేవలం క్యాడర్ ని కాపాడుకోవడానికే పోటీ చేయాలి” అంటూ సరికొత్త స్క్రిప్ట్ బయటకు తీశారు.

జగన్ నోట వచ్చిన ఈ ‘ముందస్తు జామ్యం’ డైలాగులు విన్న సొంత పార్టీ లీడర్లు, కార్యకర్తలు లోపల ఏడవాలో, బయట నవ్వాలో తెలియక తలలు పట్టుకుంటున్నారు. నాయకుడే ఇలా ముందే చేతులెత్తేసి ‘మనకు గెలుపు ముఖ్యం కాదు బాబోయ్’ అని క్లారిటీ ఇచ్చేయడంతో, క్షేత్రస్థాయిలో ఉన్న క్యాడర్ లో అనవసరంగా భయం, గందరగోళం మొదలైంది. అసలే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల దెబ్బ నుంచి తమ్ముళ్లు ఇంకా కోలుకోక ముందే.. ఇప్పుడు లోకల్ బాడీ ఎన్నికల్లో కూడా గెలవలేమనే సిగ్నల్స్ అధినేత స్వయంగా ఇచ్చేయడంతో అందరూ డీలా పడిపోతున్నారు.

దీనికి తోడు సోషల్ మీడియాలో ఈ ‘గెలుపు ముఖ్యం కాదు’ డైలాగ్ పై వస్తున్న ట్రోల్స్, మీమ్స్ భరించలేక వైకాపా సోషల్ మీడియా వింగ్ ఫోన్లు స్విచ్చాఫ్ చేసుకుంటోంది. నోటిఫికేషన్ రాకముందే ఎన్నికలు ఆపాలని కోర్టుకు వెళ్లడం, అక్కడ పప్పులు ఉడకకపోయేసరికి ఇలా క్యాడర్ పేరుతో కవరింగ్ చేయడం చూసి విపక్షాలు గట్టిగానే నవ్వుకుంటున్నాయి. రాజధాని విషయంలో 2014 నుండి అమరావతికి జై కొట్టి.. ఆ తర్వాత మూడు ముక్కలాట ఆడి ఎలాగైతే మాట మార్చారో, ఇప్పుడు స్థానిక ఎన్నికల్లోనూ అదే పంథా రిపీట్ అయిందని విశ్లేషకులు సెటైర్లు వేస్తున్నారు. రేపు పొద్దున ఎన్నికలు ముగిశాక.. “కేంద్ర బలగాలను పంపలేదు.. చంద్రబాబు అరాచకాలు చేసి గెలిచాడు.. అందుకే మా కేడర్ ప్రాణాలు కాపాడడానికే మేం పోటీకి దూరంగా ఉన్నాం” అంటూ సరికొత్త బుకాయింపు స్క్రిప్ట్ చదివినా ఆశ్చర్యపోనక్కర్లేదు అంటూ టీడీపీ సెటైర్ లు వేస్తోంది.