ఐపిఎస్ లపై సస్పెన్షన్ వేటు.. చివరకు సాగిలపాటు.. కూటమి ప్రభుత్వం ‘ఫూల్’ అయిందా..?

ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ముంబై నటి కాదంబరి జెత్వాని కేసులో సీనియర్ ఐపీఎస్ అధికారులపై ఉధృతంగా విరుచుకుపడ్డ కూటమి ప్రభుత్వం.. చివరకు ఏమీ చేయలేక చల్లబడింది. ఐపీఎస్ అధికారులు కాంతి రాణా టాటా, విశాల్ గున్నిలపై విధించిన సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ, వారిని తక్షణమే విధుల్లోకి ఆహ్వానిస్తూ ప్రభుత్వం జీవో నంబర్ 1335 జారీ చేయడం ఇప్పుడు సచివాలయ వర్గాల్లోనే పెద్ద జోక్ అయిపోయింది. మొదట్లో టీవీ ఛానళ్లలో పెద్ద పెద్ద హెడ్‌లైన్స్‌తో, ప్రెస్ మీట్లతో హడావుడి చేసిన ప్రభుత్వం.. చివరకు చట్టపరమైన ఇబ్బందులు ఎదురయ్యే సరికి తోక ముడిచి అధికారుల ముందే సాగిలపడిందనే టాక్ గట్టిగా వినిపిస్తోంది.

నిజానికి ఈ కేసులో అధికారులపై వేటు వేసి తామేదో పెద్ద విజయం సాధించామని కూటమి పెద్దలు భావించారు. కానీ సీఐడీ తాజా చార్జ్‌షీట్‌లో అసలు బాంబు పేల్చింది. బాధితురాలిగా కలరింగ్ ఇచ్చిన ఆ ముంబై నటి కాదంబరి జెత్వానిదే అసలు తప్పు అని, వైసిపి నేతను బ్లాక్‌మెయిల్ చేసి ఆమె ఏకంగా ₹1.32 కోట్లు వసూలు చేసిందని దర్యాప్తు సంస్థలే కోర్టుకు వివరించాయి. అంటే, ఒక వసూళ్ల రాణి ఫిర్యాదును నమ్మి, ఎలాంటి పక్కా ఆధారాలు లేకుండా ఐపీఎస్ అధికారులను సస్పెండ్ చేసి ప్రభుత్వం ఎంత ‘ఫూల్’ అయిందో అధికారుల రీ-ఎంట్రీతో క్లియర్ గా అర్థమవుతోందనే మాట వినపడుతోంది.

దర్యాప్తులో నటిదే తప్పు అని తేలడంతో, క్యాట్ మరియు హైకోర్టుల నుండి ప్రభుత్వానికి ఎక్కడ మొట్టికాయలు పడతాయోననే భయంతోనే అత్యవసరంగా సస్పెన్షన్ ఎత్తివేశారనేది జగమెరిగిన సత్యం అంటున్నాయి రాజకీయ వర్గాలు. అధికారులను విధుల్లోకి అయితే తీసుకున్నారు కానీ, వారికి ఎలాంటి లూప్-లైన్ లేదా ప్రాధాన్యత లేని పోస్టింగులు ఇచ్చి తమ పరువు కాపాడుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. మొదట్లో అరెస్టులు, జైళ్లు అంటూ బిల్డప్ ఇచ్చి.. చివరకు నటిదే తప్పు అని తేలడంతో కేసును ఎలా క్లోజ్ చేయాలో తెలియక తలపట్టుకుంటున్నారు. చట్టం, ప్రొసీజర్స్ తెలియకుండా కేవలం రాజకీయ కక్షలతో అధికారులపై వేటు వేస్తే.. చివరికి ఇలాగే ‘సెల్ఫ్ గోల్’ అవుతుందని నెటిజన్లు వెటకారంగా కామెంట్లు పెడుతున్నారు. మొత్తానికి, ఐపీఎస్ అధికారుల పవర్ ముందు కూటమి వ్యూహాలు అట్టర్ ఫ్లాప్ అయ్యాయని డిపార్ట్‌మెంట్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి.