Nimmala Ramanaidu: నిర్దేశిత గడువులోగా ప్రాజెక్టులు పూర్తి కావాలి: మంత్రి నిమ్మల రామానాయుడు హెచ్చరిక

Nimmala Ramanaidu: ఇరిగేషన్ ప్రాజెక్టుల పనులను శరవేగంతో పూర్తి చేసి, ప్రజలకు సత్వరమే ఫలితాలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు స్పష్టం చేశారు. మంగళవారం వెలిగొండ ప్రాజెక్ట్, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనుల పురోగతిపై ఆయన ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పనుల్లో జాప్యం వహించే అధికారులు, కాంట్రాక్ట్ ఏజెన్సీల తీరుపై మంత్రి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

వెలిగొండ ప్రాజెక్టు టన్నెల్ లైనింగ్ పనులు షెడ్యూల్ ప్రకారం జరగకపోవడంపై మంత్రి అసహనం వ్యక్తం చేశారు. “ప్రతివారం సమీక్షలు నిర్వహిస్తున్నా, పనుల్లో పురోగతి లేకపోవడంపై సమాధానం చెప్పాల్సి ఉంటుంది. జాప్యానికి కారణమైన వారు నేరుగా అమరావతి వచ్చి వివరణ ఇవ్వాలి” అని ఆయన హెచ్చరించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యాన్ని ఏమాత్రం సహించబోమని, అధికారులందరూ సంయుక్త బాధ్యతతో పనిచేసి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని సూచించారు.

ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరిస్తూ మంత్రి ఈ క్రింది కీలక ఆదేశాలను జారీ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు, రాబోయే జూన్ నాటికి నల్లమల సాగర్‌ను నింపేలా పనులన్నీ పూర్తి చేయాలి. ఈ సీజన్ ప్రారంభమయ్యేలోగా గోదావరి జలాలను అనకాపల్లి వరకు తీసుకెళ్లేలా పనులను వేగవంతం చేయాలి. పోలవరం, హంద్రీనీవా తర్వాత వెలిగొండ, పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులకే ప్రభుత్వం అగ్రతాంబూలం ఇస్తుందని మంత్రి గుర్తు చేశారు.

ప్రాజెక్టుల వల్ల నిర్వాసితులైన వారికి త్వరలోనే పునరావాస పరిహారం (R&R Package) అందిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. ప్రాజెక్టుల పురోగతిపై ప్రతి వారం ముఖ్యమంత్రికి నివేదిక సమర్పించాల్సి ఉంటుందని, కాబట్టి ఏజెన్సీలు ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వం ప్రదర్శించకూడదని ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఇరిగేషన్ సలహాదారు వెంకటేశ్వరరావు, ఈఎన్‌సీ నరసింహమూర్తి, ఆయా ప్రాజెక్టుల సీఈలు, ఏజెన్సీల ప్రతినిధులు మరియు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Analyst KS Prasad Reaction On Mittal Steel Plant | Vizag Steel Plant | CM Chandrababu Naidu | TR