మరో మూడు నాలుగు నెలల్లో కార్పొరేషన్ ఎన్నికలకు రంగం సిద్ధం చేయాలని కూటమి ప్రభుత్వం నిర్ణయించినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. సరిగ్గా ఈ సమయంలో టీడీపీ కేంద్ర కార్యాలయంలో క్లస్టర్ ఇన్ చార్జులకు శిక్షణ తరగతులు నిర్వహించిన సందర్భంగా వారితో మాట్లాడిన చంద్రబాబు… ప్రభుత్వం పడుతున్న ఆర్థిక ఇబ్బందుల్ని ప్రజలకు అర్థమయ్యేలా చెప్పాలని వారికి సూచించారు. దీంతో వాళ్లంతా బయటకు వెళ్లిన తర్వాత తలలు పట్టుకున్నట్లు చెబుతున్నారు.
ఎందుకంటే… ఏపీలో చంద్రబాబు అంతెత్తున ఇచ్చిన హామీలైన సూపర్ సిక్స్ పథకాలు అమలు ఎలా ఉందనేది చంద్రబాబు కంటే ఎక్కువగా క్షేత్ర స్థాయి పరిస్థితులపై అవగాహన ఉన్న కార్యకర్తలకు బాగా తెలుసు. పైగా… ఎన్నికలకు ముందు సంపద సృష్టించి, జగన్ కంటే ఎక్కువ సంక్షేమ లబ్ధిని కలిగిస్తానని, జగన్ పథకాలు కంటిన్యూ చేస్తూనే రెట్టింపు ఫలాలు అందిస్తామని.. నోటికి ఏది వస్తే అది అన్నట్లుగా చంద్రబాబు హామీలు ఇచ్చారు.
సంపద ఎలా సృష్టించాలో తనకు బాగా తెలుసని చెప్పుకొచ్చారు. కట్ చేస్తే… ఇప్పుడు ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. పైగా ఈ విషయం ప్రజలకు అర్ధమయ్యేలా చెప్పాలని కార్యకర్తలకు చెబుతున్నారు.
అలా అని ఇదొక్కటే కాదు… ఇటీవల అధికారులతో జరిగిన మీటింగ్స్ లోనూ, తాజాగా జరిగిన కేబినెట్ మీటింగ్ లోనూ చంద్రబాబు.. పాలనపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు కథనాలొచ్చిన సంగతి తెలిసిందే. ప్రజల్లో తమ ప్రభుత్వ పాలనపై అసంతృప్తి ఉందని.. అధికారులు సరిగా పని చేయడం లేదని.. రకరకాలుగా తన ఆవేదనను వెళ్లగక్కినట్లు చెబుతున్నారు. పైగా ఆ నెపం మొత్తం అధికారులకు ఆపాదిస్తున్నారని అంటున్నారు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే… ఇదంతా ఎంతో బలంగా ఉన్న కూటమి ప్రభుత్వం ఏర్పడిన కేవలం రెండేళ్లలో జరగడం. హామీలు ఇచ్చి అందలం ఎక్కడం, ఆ తర్వాత తప్పించుకు తిరుగువాడు ధన్యుడు సుమతీ అన్నట్లుగా వ్యవహరించడం చంద్రబాబుకూ అలవాటే… చంద్రబాబును మళ్లీ మళ్లీ నమ్మడం ఏపీ వాసులకూ అలవాటే అనే కామెంట్లు వినిపిస్తోన్న వేళ… రాబోయే రోజుల్లో చంద్రబాబు ఇంకా ఎలాంటి హామీలిస్తారనేది వేచి చూడాలి.
ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా ఓ ప్రముఖ న్యూస్ ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వైసీపీ కీలక నేత, ఆ పార్టీ ఎంపీ మిథున్ రెడ్డి పలు కీలక వ్యాఖ్యలు చేశారు.
ఏపీలో కూటమి పాలనపై ప్రజలు పూర్తి అసంత్ప్రుగా ఉన్నారనే విషయంపై చంద్రబాబుకు సైతం ఫుల్ క్లారిటీ ఉందని చర్చ జరుగుతున్న వేళ… ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే వైసీపీ అధికారంలోకి రావడం తథ్యం అని మిథున్ రెడ్డి బల్ల గుద్ది మరీ చెప్పారు.
అంతే కాదు… చంద్రబాబు తన కేబినెట్ మీటింగ్స్ లో అనధికారికంగా, ఆఫ్ ద రికార్డ్ పడుతున్న ఆవేదనపైనా చర్చ జరుగుతున్న వేళ… గ్రౌండ్ లో ఎక్కడ చూసినా ప్రభుత్వం మీద తీవ్ర వ్యతిరేకత ఉందంటూ బాబు మాటలకు మిథున్ రెడ్డి బలం చేకూర్చారనే చర్చా మొదలైంది. రెండేళ్లలో సుమారు 10 లక్షల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పుకుంటున్న కూటమి ప్రభుత్వం చెప్పేవన్నీ ఉత్తి కబుర్లు అనే విషయం పార్లమెంట్ సాక్షిగా వెల్లడైందని మిథున్ రెడ్డి వివరణ ఇచ్చారు.
ఇందులో భాగంగా.. ఏపీలో టీడీపీ ప్రభుత్వం హయాంలో నిరుద్యోగం దేశంలోనే టాప్ అని.. జాతీయ స్థాయిలో సగటు 5.2 ఉంటే, ఏపీలో అది 8.2 గా ఉందని అన్నారు. తాను పార్లమెంట్ లో వేసిన ప్రశ్నకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన సమాధానం ఇది అని మిథున్ రెడ్డి స్పష్టం చేశారు. వైసీపీ హయాంలో ఏపీలో నిరుద్యోగం రేటు 3.2 శాతం మాత్రమే ఉందని గుర్తుచేశారు.
మరి ఈ లెక్కన చంద్రబాబు ఏపీలోని నిరుద్యోగులందరికీ ఇస్తానని చెప్పిన నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి సంగతేమిటనే చర్చా ఈ సందర్భంగా మొదలైంది. మరి ఈ లెక్కన ఇప్పటికిప్పుడు సార్వత్రిక ఎన్నికలు ఎలాగూ రావు కాబట్టి… త్వరలో రాబోయే కార్పొరేషన్ ఎన్నికల్లోనే టీడీపీ పాలనపై రాబోయే ప్రజా తీర్పుపై ఓ స్పష్టమైన స్పష్టత వచ్చే అవకాశం ఉందని అంటున్నారు పరిశీలకులు.
