Jagan Join Hands With BJP : బీజేపీతో వైఎస్ జగన్ కలవబోతున్నారా.?

Jagan Join Hands With BJP : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఇటీవల ఢిల్లీకి వెళ్ళి వచ్చాక ఆయన మాట తీరు చాలా చాలా మారిపోయింది.

కొడాలి నాని తదితరులు మాట్లాడే భాషలో మాట్లాడుతున్నారు వైఎస్ జగన్.

అదంతా కొడాలి భాష కాదు,అది నిఖార్సయిన వైఎస్ జగన్ భాష.. ఇప్పుడిప్పుడే వైఎస్ జగన్ మోహన్ రెడ్డిలో అసలు కోణం బయటపడుతోంది.. అనే విమర్శలొస్తున్నాయి.

సరే, రాజకీయాల్లో ఇలాంటి విమర్శలు మామూలేననుకోండి.. అది వేరే సంగతి.

అయినాగానీ, వైఎస్ జగన్ ఇటీవల ఢిల్లీకి వెళ్ళి వచ్చాక చాలా మారారు. ఆ మార్పుకి కారణం.. విపక్షాలు ఆరోపిస్తున్నట్టు ఢిల్లీ పెద్దలు పీకిన క్లాస్ వల్లనే అనుకోవాలా.? లేదంటే బీజేపీ నుంచి వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి భరోసా లభించడం వల్ల అనుకోవాలా.?

తెలుగుదేశం పార్టీ, యెల్లో మీడియా.. వీటితోపాటు దత్త పుత్రుడు..అంటున్నారుగానీ, ఎక్కడా వైఎస్ జగన్ భారతీయ జనతా పార్టీ మీద విమర్శలు చేయడంలేదు.విశాఖ స్టీలు ప్లాంటుని ప్రైవేటీకరిస్తామంటున్న కేంద్రంపై విమర్శలు చేయడానికి వైఎస్ జగన్ సాహసించడంలేదు.

ప్రత్యేక హోదా ఇవ్వని కేంద్రంపై మండిపడటంలేదు. పోలవరం ప్రాజెక్టుకి సహకరించని బీజేపీని నిలదీయడంలేదు.

సో, ఇదంతా బీజేపీతో వైఎస్ జగన్ కలవబోతున్నారనడానికి సంకేతమన్నది రాజకీయ విశ్లేషకుల వాదన. జనసేన పార్టీ, తెలుగుదేశం పార్టీతో కలిసి వెళ్ళనుందన్న ప్రచారం నేపథ్యంలో బీజేపీ నేతలు కొందరు తెరవెనుకాల గుస్సా అవుతున్నారు.

ఈ వ్యవహారం బీజేపీ అధిష్టానం దృష్టికి కూడా వెళ్ళిందట.

వైసీపీతో కలిసి వెళ్ళడం వల్ల బీజేపీ పట్ల కొంత సానుకూలత ఏపీలో వుంటుందనీ బీజేపీ నేతలు కొందరు భావిస్తున్నారట. ఈ ‘అట’లో ఎంత నిజముందోగానీ, రాజకీయాల్లో ఏదైనా జరగొచ్చు.